userpic
user icon
0 Min read

అందాల పోటీలు చూసేందుకు ఎగ‌బ‌డుతోన్న జ‌నాలు.. దెబ్బ‌కు వెబ్‌సైట్ నిలిపివేసిన అధికారులు

Miss World 2025 Grand Opening in Hyderabad on may 10th
Miss World Krystyna

Synopsis

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు శనివారం సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గురువారం నుంచే స్టేడియంలో రిహార్సల్స్ ఉత్సాహంగా సాగాయి. వివిధ దేశాల కంటెస్టెంట్లు అందమైన కాస్ట్యూమ్స్‌తో స్టేజ్‌పై తమ నడకలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
 

తాత్కాలికంగా వెబ్‌సైట్ నిలిపివేత‌:

మిస్ వరల్డ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారికోసం టూరిజం శాఖ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. నిర్వాహ‌కులు తొలుత 1,000 పాస్‌లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించగా, తొలి గంటలలోనే 7,000 మంది నమోదు కావడంతో వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. మొత్తంగా ఐదు కేంద్రాల్లో, ప్రతి కేంద్రానికి 1,000 మందికి చొప్పున 5,000 మందికి లైవ్ ఈవెంట్ చూసే అవ‌కాశం కల్పిస్తున్నారు.

తెలంగాణ జ‌రూర్ ఆనా నినాదంతో:

ఈ పోటీలను తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక గుర్తింపుగా మలిచేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించింది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే లక్ష్యంతో కూడిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, పర్యాటక ఆదాయం పెరుగుతుందిన‌ ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రాష్ట్రాల ప్రధాన విమానాశ్రయాల్లో, దేశ విదేశాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.

ప్రపంచ దేశాల నుంచి హాజరైన అతిథులు:

ఇప్పటికే 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, 28 మంది సంస్థ ప్రతినిధులు, 17 మంది సహాయక సిబ్బంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. 10 నుంచి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ ఈవెంట్ కొనసాగనుంది. పోటీదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

చార్మినార్‌లో హెరిటేజ్ వాక్:

ఈ నెల 13న సాయంత్రం చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాల్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లతో హెరిటేజ్ వాక్ జరగనుంది. స్థానిక కళాకారులతో సమావేశమయ్యే ఈ కార్యక్రమం 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. చార్మినార్ కట్టడంపై ప్రత్యేక ప్రదర్శనలు ఉండనున్నాయి.

భారీ భద్రత ఏర్పాట్లు – రెడ్, గ్రీన్ జోన్‌లు:

మిస్ వరల్డ్ ఈవెంట్‌కు సంబంధించి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ తెలిపారు. పోటీదారులు బస చేసే హోటళ్లు, పరిసర ప్రాంతాలను రెడ్ జోన్, గ్రీన్ జోన్‌గా విభజించారని వెల్లడించారు. అనుమతి లేనివారికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ముఖ్యఅతిథుల కోసం ప్రోటోకాల్ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ట్రాఫిక్ డైవర్షన్లు లేవు – ప్రజలకు అసౌకర్యం ఉండదు:

ఈవెంట్ సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్లు ఉండవని, సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని సీపీ స్పష్టం చేశారు. ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక బలగాలను మోహరించారని తెలిపారు. 31వ తేదీన మిస్ వరల్డ్ ఫైనల్ జరగనుంది.

Latest Videos