పండగపూట హైదరాబాద్లో చెడ్డీగ్యాంగ్ కలకలం.. హయత్నగర్లో చోరీలు
దీపావళీ పండుగపూట హైదరాబాద్లో చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోతోంది. హయత్నగర్ సమీపంలోని కుంట్లూరు ప్రాంతంలో చెడ్డీగ్యాంగ్ సంచారం అలజడి రేపుతోంది. మూడు రోజుల సమయంలో రెండు దొంగతనాలు చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు
దీపావళీ పండుగపూట హైదరాబాద్లో చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోతోంది. హయత్నగర్ సమీపంలోని కుంట్లూరు ప్రాంతంలో చెడ్డీగ్యాంగ్ సంచారం అలజడి రేపుతోంది. మూడు రోజుల సమయంలో రెండు దొంగతనాలు చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రజల సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు చెడ్డీగ్యాంగ్ను పట్టుకునేందుకు వేట ముమ్మరం చేశారు. కుంట్లూరులోని ఓ వీధిలో సంచరిస్తున్న చెడ్డీగ్యాంగ్ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ దృశ్యాల సాయంతో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించారు.
వీరి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన రాచకొండ పోలీస్ కమీషనరేట్ వీలైనంత త్వరగా చెడ్డీగ్యాంగ్ను పట్టుకునేందుకు గాలిస్తోంది.
Also Read:తెలుగు రాష్ట్రాలను వణికించిన ‘‘చెడ్డీ గ్యాంగ్’’ లీడర్ అరెస్ట్
కొద్దిరోజుల క్రితం చెడ్డీ గ్యాంగ్ లీడర్ ని హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మారణాయుధాలతో ఇళ్లపై లూటీలకు పాల్పడే ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గురు సభ్యులను ఈ నెల మొదటి వారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ముఠా కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు పక్కా సమాచారంతో గుజరాత్ లో తలదాచుకున్నట్లు గుర్తించారు. దీంతో హైదరాబాద్ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం గుజరాత్ కు వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. కాగా తాజాగా ఈ ముఠా అధినేత రామ బధియాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ చెడ్డీగ్యాంగ్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో 29 కేసులు నమోదయ్యాయి. గతంలో దొరికిన సభ్యల వద్ద నుంచి రూ.3.5లక్షల సొత్తు స్వాధీనం చేసుకోగా.. తాజాగా అరెస్టయిన నాయకుడు వద్ద నుంచి రూ.10లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులందరూ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 300గ్రాముల విలువచేసే బంగారు ఆభరణాలు, 500గ్రాముల విలువచేసే వెండి ఆభరణాలు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
హైదరాబాద్ తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి దొంగతనం స్టైల్ డిపరెంట్గా ఉండేది. మద్యాహ్నం సమయంలో తాళం వేసి వున్న ఇళ్లను గుర్తించి, రాత్రుల్లలో ఆ ఇళ్లలో దొంగతనం చేసేవారు.
Also Read:చెడ్డీ గ్యాంగ్ ఆటకట్టించిన తెలంగాణ పోలీసులు
ముఠా సభ్యులు చోరీ సమయంలో ఒంటిపై కేవలం చెడ్డీని మాత్రమే ధరించేవారు. దీంతో ఈ దొంగ మఠా పేరు చెడ్డీ గ్యాంగ్ మారింది. ముఠా సభ్యులు మారణాయుధాలతో ఇళ్లల్లోకి ప్రవేశించి చోరీలకు పాల్పడేవారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన వీరి దృశ్యాలు వీధుల్లోని సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. అప్పుడే మొదటిసారిగా చెడ్డీ గ్యాంగ్ గురించి బైటపడింది. ఈ సిసి కెమెరా దృశ్యాలను ఆధారంగా చేసుకుని హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు జరిపారు.
దీంతో కరుడుగట్టిన ఈ దొంగల ముఠా గుజరాత్లోని దావోద్లో తలదాచుకున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో తెలంగాణ పోలీసు బృందాలు దావోద్ పోలీసుల సాయంతో ఎంతో చాకచక్యంగా చెడ్డీగ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారు.