టీకా వేసుకుంటే.. కొత్త వేరింయట్లతోనే పోరాడొచ్చు..!
భవిష్యత్తులో వచ్చే కొత్త రకం వేరియంట్లపై కూడా ఈ వ్యాధినిరోదక శక్తితో పోరాడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు మనముందు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్ వేయించుకోవడం. అందుకే దేశంలోని ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలంటూ ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు కూడా. కాగా.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సహజ సిద్ధంగా వ్యాధి నిరోదక శక్తి పెరుగుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
దాని వల్ల భవిష్యత్తులో వచ్చే కొత్త రకం వేరియంట్లపై కూడా ఈ వ్యాధినిరోదక శక్తితో పోరాడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కరోనా బారినపడి తర్వాత కోలుకున్న బాధితుల రక్త నమూనాల్లో యాంటీబాడీలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని కొనుగొన్నట్లు అమెరికాలోని రాకీఫెల్లర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు.
వ్యాధినిరోధక శక్తి మరింతగా పెరిగాక సార్స్– కోవ్–2 వైరస్లను ఇమ్యూనిటీకి సంబంధించిన మెమొరీ బి–సెల్స్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని పరిశోధకులు చెప్పారు. మానవ శరీరంపై దాడి చేసే వేర్వేరు రకాల వైరస్లను అంతమొందించేందుకు మన వ్యాధినిరోధక వ్యవస్థ తయారుచేసే వేర్వేరు రకాల యాంటీబాడీల నిధే మెమొరీ బి–సెల్స్. కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత కోవిడ్ రికవరీ వ్యక్తుల్లో మరింత శక్తివంతమైన, ఎక్కువకాలం నిలిచే రక్షణవ్యవస్థ అభివృద్ధి చెందిందని చెప్పారు. కనీసం ఒక డోస్ మోడెర్నా / ఫైజర్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు గణనీయంగా పెరిగాయన్నారు.
అమెరికాలోని న్యూయార్క్లో, బ్రిటన్లో, దక్షిణాఫ్రి కాలలో తొలిసారిగా కనుగొన్న వేర్వేరు వేరియంట్లనూ నాశనంచేసే యాంటీబాడీలు వీరిలో అభివృద్ధి చెందాయి. మెమొరీ బి–సెల్స్ వల్లే ఈ యాంటీబాడీల ఉత్పత్తిసాధ్యమైందని పరిశోధకులు చెప్పారు. ఇంతవరకు కరోనా బారినపడని వ్యక్తులకూ ప్రస్తుత డోస్లతోపాటు బూస్టర్ డోస్ ఇస్తే వారికి మరింత రక్షణ లభిస్తుందని అధ్యయనం సూచించింది.