కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. కిడ్నీ సమస్యలు..!
కరోనా సోకిన తర్వాత ఇంటి వద్దే చికిత్స తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. రోజు రోజుకీ ఈ మహమ్మారి విజృంభణ పెరుగుతోందే తప్ప.. తగ్గడం లేదు. ఈ కరోనా కారణంగా.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు.. ఈ వైరస్ సోకినా.. త్వరగానే కోలుకొని బయటపడ్డారు. అయితే.. కరోనా నుంచి కోలుకున్నామని ఆనందపడేలోపే.. కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు తేలింది. కరోనా సోకిన తర్వాత ఇంటి వద్దే చికిత్స తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. వారికి గనుక కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం కూడా పెరిగే అవకాశం ఉందట.
ఈ మేరకు అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ జర్నల్లో ఒక పరిశోధన ప్రచురితమైంది. కరోనా మహమ్మారి వల్ల వచ్చే మరో తీవ్రమైన సమస్య ఇదని నిపుణులు అంటున్నారు. ప్రతి 10వేలమందిలో సుమారు 7.8 మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు సెయింట్ లూసియానాలోని వెటరన్ ఎఫైర్స్ కార్యాలయంలో పనిచేసే జియాద్ అల్ అలీ తెలిపారు. ఆయనే ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.
‘‘కరోనా సోకిన అమెరికన్లు, ప్రపంచ వ్యాప్త బాధితులతో పోల్చి చూస్తే ఇదేమీ తక్కువ సంఖ్య కాదు’’ అని జియాద్ అన్నారు. కిడ్నీ సమస్యలో అత్యంత సమస్యాత్మకమైన విషయం ఏంటంటే.. ఈ కిడ్నీ సమస్యను గుర్తించడం చాలా కష్టం. కనీసం నొప్పి కూడా పుట్టదట. ఇది ముదిరిన తర్వాత డయాలసిస్, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు అవసరం అవుతాయి. కరోనా ఆస్పత్రిలో చేరిన వారికంటే, ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందిన వారికి ఈ వైరస్ సోకే ప్రమాదం 23శాతం అధికంగా ఉన్నట్లు జియాద్ తెలిపారు.