దళిత అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై  వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఫిర్యాదు చేయనున్నట్లు వైసిపి ఎమ్మెల్యే సుధాకర్‌బాబు వెల్లడించారు.

అమరావతి: రాజధాని పేరుతో టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలకు తెరతీశారని... ఆయన మాటలు నమ్మి అమరావతి ప్రజలు మరీ ముఖ్యంగా రైతులు బలికావద్దని వైసిపి ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకరబాబు పేర్కొన్నారు. అధికారానికి దూరమైనప్పటికీ అతడి వ్యవహారశైలిలో మార్పు రాలేదని... తన ప్రజావ్యతిరేక చర్యలతో ప్రజలకు మరింత దూరమవుతున్నాడని ఆరోపించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటికే చంద్రబాబును అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు. ఆయన కుటిల రాజకీయాలకు ఎవరూ బలికావద్దని సూచించారు. ముఖ్యమంత్రి జగన్, వైసిపి నాయకుల గురించి చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ, విభజన తర్వాత శివరామకృష్ణ కమిటీలు చెప్పినా వినకుండా చివరకు నారాయణ కమిటి చెప్పిందే వేదంగా చంద్రబాబు గతంలో రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. అన్ని వర్గాలను వైయస్ జగన్ సమానంగా చూస్తున్నారని పేర్కొన్నారు. 

దళిత ఐఏఎస్ అధికారి పట్ల ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమన్నారు. ఇలా దళిత ఉన్నతాధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన్ను రాజకీయాల నుంచి బర్తరఫ్ చేసి ప్రతిపక్షహోదానుంచి డిస్మిస్ చేయాలని సుధాకరబాబు డిమాండ్ చేశారు. 

READ MORE ఎమ్మెల్యేపై దాడి.... సొంత పార్టీ కార్యకర్తలపై రోజా ఫిర్యాదు

గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల చేతుల్లో చావుదెబ్బతిన్నా చంద్రబాబుకు ఇంకా బుద్ది రాలేదన్నారు. ముఖ్యంగా ఆయన దళిత సమాజానికి పూర్తిగా దూరమైపోయారని అన్నారు. తాజాగా ఓ దళిత ప్రభుత్వాధికారిగాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. 

అమరావతి రైతులకు ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందన్నారు. చెప్పిన మాట కోసం ఎందాకైనా వెళ్లే నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని ప్రశంసించారు. అమరావతిలో కొన్నిశాఖలు,హైకోర్టు బెంచ్ ఉంటాయని స్పష్టం చేశారు. కొన్ని శాఖలు మాత్రమే విశాఖకు వెళ్తాయన్నారు. వీటన్నింటిని ప్రస్తావించకుండా వుండేలా ఎల్లోమీడియాను మేనేజ్ చేసి చంద్రబాబు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ది చెందుతాయని సుధాకరబాబు అన్నారు.

READ MORE మోడీతో భేటీ: బీజేపీలోకి మోహన్ బాబు కుటుంబం