Asianet News TeluguAsianet News Telugu

జర్నలిస్టుల కంటే కాకులే నయం... క్రూర జంతువు మాదిరిగా: పేర్ని నాని

అమరావతిలో ఇటీవల మంత్రివర్గ విస్తరణ సందర్భంలో  కొందరు నిరసనకారులు మహిళా జర్నలిస్ట్ పై దాడి చేయడాన్ని మంత్రి పేర్ని నాని  తప్పుబట్టారు. ఈ దాడిపై జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు రియాక్ట్ కావడం లేదని ప్రశ్నించారు.  

Why Journalist unions not reacted to attack on lady journalist: Perni Nani
Author
Amaravathi, First Published Dec 30, 2019, 3:40 PM IST

అమరావతి: కాకి చనిపోతే వందలకొద్ది కాకులు వచ్చి తమ జాతి పక్షి చనిపోతుందని అల్లాడిపోతాయి కానీ జర్నలిస్టులు మాత్రం అంతకంటే అద్వాన్నంగా తయారయ్యారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ప్రజలకు సేవచేయాలనే కాంక్షతో మీడియాలో ఉద్యోగం చేస్తున్న మహిళా విలేకరిని విచక్షణారహితంగా దాడి చేస్తే విలేకరుల సమాజం స్పందించకపోవడం విడ్డూరంగా వుందన్నారు.

అక్రిడిటేషన్‌ కార్డుల కోసం యూనియన్లు, సంఘాలు బయల్దేరతాయి కాని ఓ మహిళా జర్నలిస్టుపై దాడి జరిగితే ఈ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
క్రూర జంతువులు ఊర్లలోకి వస్తే దాడి చేసినట్లు జర్నలిస్ట్ పై కొందరు విచక్షణారహితంగా దాడికి పాల్పడితే పత్రికా ప్రపంచం ఎందుకు స్పందించడం లేదన్నారు.  మహిళా జర్నలిస్టులపై దాడి చేయడంపై జర్నలిస్ట్‌ సంఘనేతలు ఎందుకు స్పందించడంలేదని మంత్రి అడిగారు.  

తప్పుడు, నిరాధార వార్తలు రాస్తే రిజాయిండర్‌ ఇస్తే దానిని ప్రచురించాలని సూచించారు. అలా చేయకపోతే అలాంటి వార్త రాసిన వారిపై పరువునష్టం దావా వేయాల్సి వస్తుందని జిఓ ఇస్తే బజారు ఎక్కి మాట్లాడినవారు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి ఫైర్ అయ్యారు. 

read more  అన్నదాతలపై అటెంప్ట్ మర్డర్ కేసులా...?: జగన్ పై చంద్రబాబు ఫైర్

ఇక ఏపిఎస్ ఆర్టీసి గురించి మంత్రి మాట్లాడుతూ... జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసి కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని స్పష్టం చేశారు. వారందరికి ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు.  ఆర్టిసి ప్రస్తుతం ఉన్న పరిస్దితులలో ప్రభుత్వంలోకి తీసుకోవడం ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ గుండెధైర్యానికి నిదర్శమన్నారు.

పాదయాత్రలో ఆర్టీసి కార్మికుల కష్టాలను సీఎం తెలుసుకున్నారని... వేలాదిమంది ఉద్యోగుల కుటుంబాలలో చిరునవ్వుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.  భారతదేశ చరిత్రలో ఇది మంచి సంఘటనగా మిగిలిపోతుందన్నారు. చాలామంది ఇది సాధ్యం కాదని చెప్పారని...కాని ఆరోజు జగన్‌ సానుకూల దృక్పధంతో తీసుకున్నారని నాని తెలిపారు. 54 వేల ఆర్టిసి ఉద్యోగుల తరపున జగన్‌  కు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. 

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రైవేటు ఆపరేటర్లు అధికఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే 8309887955 నెంబర్ కు ఫోన్ గానీ వాట్సప్ ద్వారా గానీ పిర్యాదు చేయవచ్చన్నారు. 

read more  క్రైమ్ రౌండప్ 2019... విజయవాడలో పెరిగిన హత్యలు

 ఆర్టిసి కూడా 50 శాతం ఛార్జీలు పెంచుతోంది కదా అని కొందరు అడుగుతున్నారని... అయితే రెగ్యులర్‌ గా నడిపే పరిస్దితులలో వాటికి ఒక్కపైసా కూడా పెంచి తీసుకోవడం లేదన్నారు. పండుగ రద్దీ దృష్యా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేస్తేనే ఆర్టీసి నష్టాల నేపథ్యంలో అలా వసూలు చేస్తున్నామన్నారు. వ్యాపార దృక్పథంతో అలా పెంచడం లేదని... దీన్ని ప్రజలందరూ అర్దం చేసుకోవాలని మంత్రి నాని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios