Asianet News TeluguAsianet News Telugu

అలాంటి వారికే నా సపోర్ట్... పార్టీలోనూ సముచిత స్థానం...: చంద్రబాబు నాయుడు

బాపట్లకు చెందిన టిడిపి నాయకులతో గుంటూరులోని  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. 

TDP Chief Chandrababu meeting  with bapatla leaders
Author
Amaravathi, First Published Feb 6, 2020, 8:57 PM IST

గుంటూరు: ఏపీలో తుగ్లక్ పాలన అంతం చేయడానికి జరిగే పోరాటంలో టిడిపిపై చారిత్రక బాధ్యతా నెలకొందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆత్మకూరులోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన బాపట్ల నియోజక వర్గ సమీక్ష, సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ  చంద్రబాబునాయుడు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాపట్లకు ముందుగానే సమర్థుడైన ఇన్‌ఛార్జిని నియమిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంటే ఇంట్లో కూర్చుంటే కుదరదన్నారు. వైసిపి అరాచకాలను ఎదుర్కోవడంలో కార్యకర్తలు ముందుండాలన్నారు. 

ఏపీలో మరో స్వాతంత్ర్య పోరాటానికి నడుం బిగించే పోరాటయోధులకే సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అన్ని స్థాయిల్లో నాయకత్వ పటిమను నిరూపించుకోవాలని హితవు పలికారు. 

అమరావతి  ఉద్యమాన్ని ప్రజలోకి తీసుకువెళ్ళాలని ఈ సందర్భంగా నాయకులను, కార్యకర్తలను కోరారు. త్యాగాలు చేసే కార్యకర్తలున్నందునే 38ఏళ్లయినా తెదేపా పటిష్టంగా ఉందన్నారు. నిస్వార్తపూరిత కార్యకర్తలకు అధిష్టానం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

read more  చంద్రబాబు నేతృత్వంలో ఆ జాబితా రెడీ... అంతుచూస్తాం..: బుద్దా వెంకన్న సీరియస్

తాను రాజకీయం కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడుతున్నానని పేర్కొన్నారు. 9 నెలల్లో జగన్ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డపేరు వచ్చిందని... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో టిడిపి నాయకులు సఫలీకృతులు కావాలని ఆకాంక్షించారు.

ఇసుక కొరత, ఆర్టీసీ, పెట్రోల్, మద్యం ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేశారని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒకపక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, మరోపక్క సంక్షేమ పతకాల రద్దుతో జనజీవనం అస్తవ్యస్తమయిందన్నారు. 

ఎన్టీఆర్ క్యాంటీన్లు, విదేశీ విద్యా విధానం, పండగలకు కానుకలు రద్దు చేసి ప్రజలకు ద్రోహం చేశారన్నారు. ప్రస్తుతం పించన్లు , రేషన్ కార్డుల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. నానాటికీ వైసిపి ప్రభుత్వ అరాచక పాలనపై ప్రజల్లో అసహనం, వ్యతిరేకత పెరుగుతోందన్నారు. 

మూడు రాజధానుల ఏర్పాటు ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. మూడు రాజదానులకు వ్యతిరేకంగా 51 రోజులుగా ఉద్యమ చేస్తున్నారని అమరావతి ప్రాంత రైతులను అభినందించారు. రాజదాని రైతుల ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాల్సిన బాధ్యతా నాయకులపై ఉందన్నారు. 

read more  జగన్ సర్కార్ కీలక నిర్ణయం: ఆ రెండు రాజధాని గ్రామాలు ఇక...

జగన్ అసమర్థ పాలన, పీడన మూలంగా అంతర్జాతీయ కంపెనీ పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కియా ఉన్నతాధికారులపైనే కాకుండా లోక్ సభ సాక్షిగా ఎంపీ రామ్మోహన్ నాయుడుపైనా వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ దౌర్జన్యానికి పాల్పడటం దారుణమన్నారు. జగన్ ఇష్టారాజ్యంగా కియాకి రాయితీలు తొలగించడం, మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. మరో ముఖ్యమంత్రి వస్తే 5 రాజధానులు ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. 

గతంలో జరిగిన పొరబాట్లు పునరావృతం కాకుండా ముందుగానే బాపట్ల కు తెదేపా ఇన్చార్జిని నియమిస్తామని భరోసా ఇచ్చారు.ఈ బాపట్ల నియోజకవర్గ సమీక్ష, సమన్వయ సమావేశానికి మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు గుంటూరు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య , బాపట్ల నాయకులు గాదె మధుసూదన రెడ్డి, వేగేశ్న నరేంద్ర వర్మలతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు , మహిళలు హాజరయారు.

Follow Us:
Download App:
  • android
  • ios