Asianet News TeluguAsianet News Telugu

అంతుచూస్తానంటూ ఈసీకి చంద్రబాబు బెదిరింపులు... అందువల్లే...: పేర్ని నాని

కరోనా వ్యాప్తి పేరుతో ఏపిలో స్ధానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరయినా మాస్కులు ధరించి తిరుగుతున్నారా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. 

Minister Perni nani Speaks About Local Body Elections Postpened in AP
Author
Amaravathi, First Published Mar 16, 2020, 3:47 PM IST

అమరావతి: ప్రజాసంక్షేమం కాంక్షించే వ్యక్తిగా ప్రజలను నమ్మించేందుకు చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారని రాష్ట్ర సమాచార, రవాణాశాఖా మంత్రి పేర్ని కట్రామయ్య(నాని) ఎద్దేవా చేశారు. కరోనా గురించి అంతా తనకే తెలుసు అన్న విధంగా చంద్రబాబు మాటలువున్నాయని అన్నారు. సీఎం జగన్ కు దురుద్దేశాన్ని ఆపాదిస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నాడని... ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని  ఆరోపించారు.  

కరోనా వ్యాధి గురించి తనకే బాగా తెలుసు...జగన్ కు రాష్ట్రప్రజల ఆరోగ్యం కంటే ఎన్నికలే ముఖ్యమయ్యాయి అన్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. ఇలా కరోనా గురించి క్షుణ్ణంగా తెలిసిన చంద్రబాబు నామినేషన్లను ఊరేగింపులతో ఎలా చేయనిచ్చారు? అని ప్రశ్నించారు. తన పార్టీ కార్యకర్తల ప్రాణాలు పోతే పోయాయని చంద్రబాబు అనుకున్నారా? అంటూ చంద్రబాబును ఇరుకునపెట్టేలా  ప్రశ్నలు సంధించారు. 

''రాజదానిలోని అయిదు గ్రామాల్లో చంద్రబాబు సామూహిక ధర్నాలు ఎలా నడిపిస్తున్నారు? కరోనా వల్ల వారికి ప్రమాదం లేదా? ఆ ధర్నా శిబిరాలను ఎందుకు తీయించడం లేదు?
  చంద్రబాబు, ఆయన కుమారుడు ఎందుకు మాస్క్ లు కట్టుకోలేదు? నిమ్మకాయల చిన్నరాజప్ప కూడా  కరోనా కరోనా గురించి మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు ఆయన మాస్క్ కట్టుకోలేదు.ఈ రాష్ట్రంలో వ్యాధి అంతగా ప్రబలిపోతే కరోనా గురించి మాట్లాడే టిడిపి నేతలు ఎందుకు మాస్క్ లు కట్టుకోవడం లేదు?'' అని మంత్రి నాని ప్రశ్నించారు. 

''ఎన్నికల సంఘానికి కులాన్ని ఆపాదిస్తారా... బెదరిస్తారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆపద్ధర్మ సీఎంగా చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయనకు గుర్తు లేదా?కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురించి చంద్రబాబు ఎలా మాట్లాడారు? రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ద్వివేదిని ఉద్దేశించి ఎటువంటి ఆరోపణలు చేశాడు. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఏమైనా చేస్తారా...? మోదీ సంగతి చూస్తాను... నా సంగతి తెలియదు... నాతో పెట్టుకుంటే అంతు చూస్తానని బెదరించిన విషయం చంద్రబాబు మరిచిపోయాడా?'' అంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో పరిస్థితులను గుర్తుచేశారు. 

''గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని ఉద్దేశించి ఎటువంటి బెదరింపులకు పాల్పడ్డాడో చంద్రబాబుకు గుర్తు లేదా?అధికారంలో వున్నప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు జగన్ నిజాలు మాట్లాడితే తప్పుబట్టడం విడ్డూరంగా వుంది'' అని అన్నారు.

read more  జగన్ కే నా సపోర్ట్... ఈసీ చేస్తున్నదే కరెక్ట్ కాదు: జెసి సంచలనం

''రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిస్పక్షపాతంగా లేదని సీఎం జగన్ ఆరోపించారు.  చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయినట్లుగా ఎన్నికల సంఘం ప్రవర్తిస్తోందని విమర్శించారు.  ఎన్నికలు వాయిదా అంటూ టివి 5 లో మూర్తి ముందే చెప్పాడంటూ బ్రేకింగ్ లు వేసుకున్నారు. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల వాయిదాని టివి 5 కి ముందే చెప్పారా?  పక్కన వున్న అధికారులకు కూడా తెలియకుండా నిమ్మగడ్డ రమేష్ తన నోట్ ను సిద్దం చేసుకున్నారు. ఆఖరి నిమిషంలో వచ్చిన కాగితంపై నిమ్మగడ్డ రమేష్ సంతకం చేశారు.ఈ విషయం టివి 5 కి, ఆంధ్రజ్యోతికి, టిడిపి కార్యకర్తలకు ముందే ఎలా తెలిసింది?''అని నిలదీశారు. 

''రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి అభ్యర్ధులు నామినేషన్లు వేయడం తప్ప ఎక్కడా ప్రచారం చేయలేదు.పైగా ఎన్నికలు ఆగిపోతాయని ముందు నుంచే చెబుతున్నారు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి. దీనిపై సీఎం జగన్ మాట్లాడితే తప్పా?''అని అడిగారు. 

''నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సంఘానికి ఉద్దేశాలను ఆపాదించడం రాజ్యాంగ విధులను అడ్డుకోవడమేనని అన్నారు. ఎన్నికల అధికారిగా మీ ప్రవర్తన రాజ్యాంగ విరుద్దంగా వుంటే... మాట్లాడకుండా ఎలా వుంటాం? రాజ్యాంగపరిధిలో మీ విచక్షణా అధికారాలను సక్రమంగా వాడితే విమర్శలు రావు. వ్యవస్థలను ద్వంసం చేయాలని అనుకుంటే మీకు విలువ ఎలా ఇస్తాం? '' అని అన్నారు. 

''కరోనా రాష్ట్రంలో విజృంభించి వుంటే... సిఎస్, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని, వైద్యాధికారులను పిలిచి ఎన్నికల అధికారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనికి సంబంధించిన ఏ ఒక్క నిబంధనను పాటించలేదు. హెల్త్ ఎమర్జెన్సీ వుందని రాష్ట్రప్రభుత్వం నుంచి ఏ అధికారి మీకు చెప్పారు? రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితులను సమీక్షించకుండా ఎన్నికల అధికారిగా వాయిదా నిర్ణయం ఎలా తీసుకుంటారు?నిమ్మగడ్డ ఏ ప్రలోభాలకు లొంగి ఈ నిర్ణయాలు తీసుకున్నారో అనే అనుమానాలు ప్రజలకు వస్తున్నాయి'' అంటూ మంత్రి నాని ఈసీని ప్రశ్నించారు. 

read more  వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములు: ఈసీ రమేష్ పై తమ్మినేని వ్యాఖ్యలు

''పోలీస్ అధికారుల ప్రవర్తన బాగోలేదని, వారిని బదిలీ చేయాలని నిమ్మగడ్డ రమేష్ చెబుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా వుంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనలపై అదే రోజు ఎందుకు ఎన్నికల అధికారిగా స్పందించలేదు.? జగన్ ఇమేజ్ ను డ్యామేజీ చేయడానికే ఎన్నికల అధికారిగా మీరు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. 
మీరు తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకునేందుకే అధికారులపై చర్యలు అంటున్నారు. నామినేషన్లు, విత్ డ్రాల ప్రక్రియ పూర్తయిన తరువాతే మీకు అక్రమాలు కనిపించాయా?
మీరు తీసుకున్న నిర్ణయాల్లో ధర్మం లేదని ప్రజలకు అర్ధమవుతోంది.కళ్ళుమూసుకుని పాలు తాగుతున్న పిల్లి చందంగా వుంది మీ వైఖరి'' అంటూ ఈసీపై విమర్శలు చేశారు. 

''ఇప్పటికైనా రమేష్ కుమార్ బంధుత్వాలు, స్నేహాలు, ఒత్తిళ్ళకు లొంగకుండా ప్రజాస్వామ్యబద్దంగా వ్యవమరించాలి. తన హోదా, దాని పవిత్రతను గురించి ఆలోచించి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలి.ప్రజాస్వామ్యంను కాపాడాలి. వ్యవస్థలను ద్వంసం చేసే వ్యక్తుల వత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకోవద్దు'' అని నాని విజ్ఞప్తి చేశారు.

''చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం అయితే...రూ. లక్షలు ప్రోత్సాహకంగా పంచాయతీలకు ఇస్తామని జీఓలు ఇచ్చారు. అంటే ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవం అవ్వడాన్ని ప్రభుత్వాలు స్వాగతిస్తున్నాయి. ఏకగ్రీవం వల్ల సమాజానికి మంచి జరుగుతుందనే కదా నగదు ప్రోత్సాహాలు ఇస్తున్నది. జగన్  పాలనను మెచ్చి, ఈ ఎన్నికల్లో ప్రజలు మద్దతు పలుకుతున్నారు. టిడిపికి అభ్యర్ధులు దొరకక, ఎన్నికల్లో ఓటమి పాలవుతారని కార్యకర్తలు బేజారవుతున్నారు. లోకేష్, చంద్రబాబులు కలిసి టిడిపిని ఇటువంటి దిక్కులేని స్థితికి చేర్చారు. చంద్రబాబు వైఫల్యాలకు జగన్ గారిని దుర్మార్గుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చంద్రబాబు హీనమైన, హేయమైన వైఖరికి నిదర్శనం''అని మండిపడ్డారు. 

''రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి చంద్రబాబు. దేశంలోనే ఎటువంటి వ్యవస్థను అయినా సరే భ్రష్టు పట్టించగిలిన వ్యక్తి చంద్రబాబు. వెన్నపోటుతో పార్టీని దక్కించుకున్న వ్యక్తి , ప్రజాస్వామ్యంను ఖూనీ చేసి, ఎపి ఎన్నికల్లో డబ్బును ప్రవేశపెట్టిన వ్యక్తి చంద్రబాబు. పార్టీలు మార్చడం నుంచి స్పీకర్, గవర్నర్, డిజిపి, చీఫ్ సెక్రటరీ పదువులకు విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రజాస్వామ్యంను చంద్రబాబు ద్వంసం చేస్తున్నాడు'' అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. 

''వందకు పైగా స్థానాలు ఇచ్చి పరిపాలించాలని 2014 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత లోకేష్ కోసం ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభాలకు గురి చేశాడు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేశాడు.అధికారం పోవడంతో మానసిక వైరాగ్యం, రోగంతో చంద్రబాబు కొట్టుమిట్టాడుతున్నాడు'' అని విమర్శించారు. 

''తన గురించి బాకా ఊదే పేపర్లను ఎల్లో మీడియా అనడాన్ని చంద్రబాబు ఎలా తప్పుపడతాడు? ప్రజాస్వామ్యబద్దంగా వున్న ప్రతి వ్యవస్థను దిగజార్చడం చంద్రబాబుకు అలవాటు. 
అందులో భాగంగానే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన తరువాత ప్రలోభాలతో ఒక పత్రికను నిర్వీర్యం చేశాడు. అన్యాయంగా సంపాధించిన డబ్బుతో మూతపడిన మరో పేపర్ ను తెరిపించాడు. ఈ రెండు పత్రికలను ఎల్లో మీడియాగా మార్చుకున్నావు.  సాక్షాత్తు రామోజీరావు కోర్ట్ లో తాను కాంగ్రెస్ వ్యతిరేకినని ఒప్పుకున్నాడు'' అని గుర్తుచేశారు. 

''బిజెపి, జనసేన, కాంగ్రెస్, సిపిఐలు రాజకీయ పార్టీలుగా ప్రవర్తించడం లేదు.  ఆయా పార్టీల నేతలు తమ పార్టీ  ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదు. రాజకీయాల కోసం, కక్కుర్తి కోసం నేతలు పనిచేయకూడదు.  చంద్రబాబుకు తోకపార్టీలుగా మారి, ఆయన గళంగా పనిచేయకూడదని విజ్ఞప్తి.  రాజకీయ లక్ష్యాలకు భిన్నంగా... అవసరాల కోసం రాజకీయాలు చేయవద్దని...ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా గుర్తించాలని కోరుతున్నాం. పసుపు ఊబి నుంచి బయటకు వచ్చి జనం కోసం పనిచేయాలని ఆ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం'' అని అన్నారు. 

''చంద్రబాబు బహిరంగ చర్చకు నేను సరిపోతాను. చంద్రబాబుతో చర్చించేందుకు నేను సిద్దం. గత అయిదేళ్లుగా చంద్రబాబు చేసిన తప్పులును చర్చించేందుకు సిద్దం.
చంద్రబాబుతో మీడియా ప్రతినిధులు మాట్లాడి తేదీ, సమయం, వేదికను నిర్ణయించాలి'' అని మంత్రి సవాల్ విసిరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios