Women in 40's: 40 దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన ఐదు ఆహారాలు ఇవే
Women in 40's: వయసు పెరుగుతుంటే శరీరంలో మార్పులు రావడం సహజం. ముఖ్యంగా మహిళలకు ఏజ్ పెరుగుతుంటే ఆరోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఇబ్బంది పడకూడదంటే ఆమారంలో మార్పులు కచ్చితంగా చేసుకోవాలి.

మహిళలు తినాల్సిన ఫుడ్స్..
మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరం బలహీనంగా మారడం మొదలౌతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు తగ్గడం వల్ల ఎముకల సాంద్రత క్రమంగా తగ్గుతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారిపోతాయి, కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేరు. చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోతాయి. అంతేకాదు.. అలసట, కండరాల బలహీనత వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే.. 40 దాటిన తర్వాత కచ్చితంగా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను ప్రతిరోజూ తీసుకోవాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఏ ఆహారాలు తీసుకుంటే 40 తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటారో ఇప్పుడు చూద్దాం..
పెరుగు..
పెరుగును చాలా మంది పెద్దగా పట్టించుకోరు. పెరుగులో ఏం ఉంటుందిలే అనుకుంటారు. కానీ.. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. కీళ్ల ఆరోగ్యం బాగుంటుంది. గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. అందుకే 40 దాటిన మహిళలు... ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి.
కోడిగుడ్లు...
వయసు 40 దాటిన మహిళలు ప్రతిరోజూ తమ డైట్ లో కోడి గుడ్లను చేర్చుకోవాలి. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్ కూడా ఉంటుంది. రోజూ ఒకటి నుంచి 2 కోడిగుడ్లు తినడం వల్ల కండరాలు బలంగా మారతాయి. ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలసట లేకుండా.. ఎనర్జిటిక్ గా ఉంటారు.
బాదం పప్పు, నువ్వులు..
బాదం పప్పులో మెగ్నీషియం, నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్ శరీరానికి అందుతాయి. ప్రతిరోజూ రాత్రి నానపెట్టిన 5 నుంచి 6 బాదం పప్పులను ఉదయాన్నే తీసుకోవచ్చు. రోజుకి ఒక స్పూన్ నువ్వులు తినాలి.
ఆకు కూరలు..
40 ఏళ్లు దాటిన మహిళలు ప్రతిరోజూ పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు రోజూ తీసుకోవాలి. వీటిల్లో కాల్షియం, ఐరన్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. రక్తహీనత సమస్య ఉండదు. శరీరానికి అవసరమైన ఖనిజాలు కూడా అందుతాయి. ప్రతిరోజూ తినకపోయినా వారానికి 4 నుంచి 5 సార్లు అయినా ఆకుకూరలు తీసుకోవాలి.
పప్పులు, శనగలు
పప్పులు, శనగలు, రాజ్మా, సోయాబీన్స్ వంటి వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కండరాల క్షీణత తగ్గుతుంది. శక్తి పెరుగుతుంది. ఎక్కువ సేపు ఆకలివేయదు. అధిక బరువు పెరిగే సమస్య ఉండదు. ప్రతిరోజూ పప్పు, శనగలు తీసుకోవాలి.
ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడంతో పాటు.. ప్రతిరోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలపాటు నడవాలి. ఎండ తగిలే సమయంలో నడవడం మంచిది. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. యోగా చేసినా మంచిదే. తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు.

