- Home
- Telangana
- IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే
Andhra Pradesh Weather, Telangana Weather : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలేే వర్షాలు
Rain Alert : ఈ వేసవిలో ఎండల కంటే ముందే వర్షాలు మొదలయ్యాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో... అటు ఆంధ్ర ప్రదేశ్ లో అనకాపల్లి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. మరో రెండురోజులు (సోమ, మంగళవారం) కూడా ఇలాగే ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. గతవారం ఏకంగా రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి... ఇందులో ఒకటి బలహీనపడగా ఇంకోటి బలపడుతోంది. ఇలానైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనమే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు కారణం అవుతోంది. ఇది రెండుమూడు రోజులు యాక్టివ్ గా ఉంటుందని... దీని ప్రభావంతో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే వర్షాలు మొదలవగా ఇవాళ (ఫిబ్రవరి 23, సోమవారం) తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ లో వర్షాలు
ఇక హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇలా వర్షాలు కురిసే అవకాశాలున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఫిబ్రవరి 24న వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రేపు (ఫిబ్రవరి 24, మంగళవారం) కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట , యాదాద్రి భువనగిరి , నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
ఏపీలో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ (ఫిబ్రవరి 23న) కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA). అల్పపీడనం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
తెలుగు ప్రజలు తస్మాత్ జాగ్రత్త..
తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు తోడయి ప్రమాదకరంగా మారే అవకాశాలుంటాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేపట్టే రైతులు, కూలీలు వర్షాల సమయంలో చెట్లకింద ఉండరాదని సూచిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు.

