Rain Alert : ఆ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు... 33 జిల్లాలకు బిగ్ వార్నింగ్
ఇవాళ (ఏప్రిల్ 26, ఆదివారం) ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఎండల తీవ్రత ఎలా ఉంటుంది..? ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి..? రాాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది..? ఇలాంటి పూర్తి సమాచాారం ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో ఎండావాన వెదర్...
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి... ఓ వైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఆసక్తికమైన విషయం ఏంటంటే రానురాను ఎండలతో పాటు వర్షాలు కూడా పెరిగే అవకాశాలున్నాయట.
ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) హయ్యెస్ట్ టెంపరేచర్స్ 45 డిగ్రీలకు చేరుకున్నాయి... రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో వానలు కూడా కొనసాగుతాయని... నెల చివర్లో మరింత ఊపందుకుంటాయని ప్రకటించింది. ఇలా ఎండావానలు తెలుగు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే ఛాన్సెస్ ఉన్నాయి.
తెలంగాణ వర్షాలు..
తెలంగాణలో ఇవాళ (ఏప్రిల్ 26, ఆదివారం) అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం యధావిధిగా ఎండలు కొనసాగుతాయని... సాయంత్రం వర్షాలు మొదలవుతాయని ప్రకటించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ వర్షాలకు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు తోడవుతాయని... దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
ఈ రెండ్రోజులు తెలంగాణవ్యాప్తంగా వానలు...
రెండుమూడు రోజులు ఎండలు మండిపోతాయని... కొన్నిచోట్ల అత్యధికంగా 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటాయట. అయితే ఏప్రిల్ 28, 29 రెండ్రోజులు తెలంగాణవ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ప్రారంభమయ్యే వానలు రాష్ట్రం మొత్తానికి వ్యాపిస్తాయని... దీంతో వాతావరణం చల్లబడుతుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణలో మండిపోతున్న ఎండలు
ఇక నిన్న (ఏప్రిల్ 25న) అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ 42.8 డిగ్రీలు నమోదయ్యాయి... అత్యల్పంగా హైదరాబాద్ శివారు పటాన్ చెరులో 21.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 26, ఆదివారం) కూడా అత్యధిక జిల్లాల్లో 41 నుండి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట... ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం..
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే... ఇవాళ (ఏప్రిల్ 26) రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. నేడు 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయంటోంది... అవి విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర... పార్వతీపురంమన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం... అల్లూరి జిల్లాలోని జికే వీధి... పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాలు. ఈ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని APSDMA సూచించింది.
నిన్న (శనివారం) కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 44.8°C, కడపలో44.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 18 జిల్లాల్లోని 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవాళ కూడా ఇదేస్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని... కొన్నిచోట్ల తారాస్థాయికి చేరే అవకాశాలున్నాయని APSDMA హెచ్చరిస్తోంది.

