Telangana rains: రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు
Telangana rains: తెలంగాణలో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాల రాకతో వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.

weather update: తెలంగాణలో భారీ వర్షాలు
Telangana rains: తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. గతవారం నుంచి కురుస్తున్న వర్షాలు మరింతగా పెరిగాయి. దీనికి రుతుపవనాల రాకనే కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు మే 28న ప్రవేశించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. అలాగే, పిడుగులు, బలమైన ఈదురుగాలులు ఉంటాయని పేర్కొంది.
తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు మే 27 నుంచి 30 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆ తర్వాత కొంతమేర తక్కువ లేదా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశముండడంతో వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో గద్వాల్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండలలో ఇప్పటికే నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది. అందుకే దక్షిణ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వారంలో భారీ వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.
హైదరాబాద్ వాతావరణ పరిస్థితి ఎలా ఉందంటే?
హైదరాబాద్లో వచ్చే రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 30 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది.
రుతుపవనాలు సాధారణ షెడ్యూల్ కంటే దాదాపు రెండు వారాల ముందే రావడంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
తెలంగాణకు సాధారణం కంటే ముందుగానే రుతుపవనాల రాక
సాధారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ 8-10 మధ్య ప్రవేశించి జూన్ 12 లేదా 14 నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది సోమవారం నుంచే రుతుపవనాల ప్రభావం మొదలైంది. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కంటే తక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.