- Home
- Telangana
- Traffic Rules: ఫైన్ పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్.. సీఎం సంచలన ప్రకటన
Traffic Rules: ఫైన్ పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్.. సీఎం సంచలన ప్రకటన
Traffic Rules: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే అధికారులు ఫైన్ వేస్తుంటారు. సహజంగా వీటిని ఆన్లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫైన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే. వినడానికి షాకింగ్గా ఉంది కదూ..!

ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఇక కఠిన వైఖరి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫైన్ విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. డిస్కౌంట్లు ప్రకటించడం వల్ల వాహనదారుల్లో నిర్లక్ష్యం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ నియంత్రణ రాష్ట్రానికి పెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు.
ఫైన్ పడితే ఆటోమేటిక్ కట్ విధానం
ట్రాఫిక్ ఉల్లంఘన జరిగిన వెంటనే జరిమానా మొత్తం నేరుగా వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి కట్ అయ్యే విధానాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. ఇందుకోసం వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు అకౌంట్ లింక్ చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియపై పోలీసులు, ఆర్టీఏ, బ్యాంకు అధికారులు కలిసి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ కార్యక్రమం ప్రారంభం
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. హైదరాబాద్ యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిల్మ్ వీడియోలు, అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.
మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్పై కఠిన చర్యలు
మైనర్లు వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. మందు సేవించి వాహనం నడిపేవారిపై కూడా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను నిర్లక్ష్యం వల్ల జరిగే హత్యలుగానే పరిగణించాలన్నారు.
నూతన చట్టం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
ప్రస్తుత నిబంధనలు సరిపోవని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త రవాణా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ట్రాఫిక్ విభాగాన్ని ప్రత్యేక వ్యవస్థగా బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఆధునిక సాంకేతికత వినియోగం, సీసీ కెమెరాల సమర్థ వినియోగం, విద్యార్థి దశ నుంచే రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడం కీలకమని పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలు పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

