- Home
- Telangana
- Medaram Travel Guide : సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళుతున్నారా..? ఈ టూరిస్ట్ స్పాట్స్ కూడా చుట్టిరండి
Medaram Travel Guide : సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళుతున్నారా..? ఈ టూరిస్ట్ స్పాట్స్ కూడా చుట్టిరండి
Medaram Sammakka Saralamma Jathara : మేడారం జాతరకు వెళ్లేవారు జంపన్నవాగులో స్నానంచేసి సమ్మక్క-సారలమ్మ గద్దెలను సందర్శించడమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా చుట్టిరావచ్చు. ఇందుకోసం మేడారం టూర్ గైడ్ ను అందిస్తున్నాం.

మేడారం చుట్టుపక్కల ప్రకృతి అందాలు
Medaram Jathara : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి మేడారం. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లక్షలాదిమంది గిరిజన దేవతలైన సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు మేడారం బాట పడతారు. ఇక తెలంగాణలో జరిగే ఈ జాతరకు తెలుగు ప్రజలు పోటెత్తుతారు... ఈసారి దాదాపు కోటిమందికి పైగా భక్తులు మేడారం వస్తారని అంచనా వేస్తున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో సమ్మక్క-సారలమ్మ కొలువయ్యారు. రెండేళ్లకోసారి గద్దెలపైకి చేరుకునే అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి, యాటలను బలిస్తూ మొక్కులు చెల్లిస్తుంటారు భక్తులు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతర ఈ నెల (జనవరి 2026) 28 నుండి 31 వరకు నాల్రోజులు జరగనుంది. మీరు కూడా ఈ మహాజాతరకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే అమ్మవార్ల దర్శనంతో పాటు మేడారం దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.
మేడారం టూర్ ప్లాన్...
హైదరాబాద్ నుండే కాదు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల నుండి మేడారంకు రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణ ఆర్టిసి అయితే జాతర సమయంలో భారీగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్దమయ్యింది. ఇక ప్రైవేట్ వాహనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... లక్షలాదిమందితో వేలాది వాహనాలు మేడారం బాట పట్టనున్నాయి.
మీరు కుటుంబసభ్యులు లేదంటే స్నేహితులతో కలిసి ప్రత్యేక వాహనంలో మేడారం వెళుతుంటే ముందుగానే టూర్ ప్లాన్ రెడీ చేసుకొండి. మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనంతో పాటు దగ్గర్లోని ప్రాంతాలను చుట్టివచ్చేలా మీకోసం టూర్ ప్లాన్ రెడీ చేసి ఇస్తున్నాం. మేడారం వెళ్లేవారు ఈ ప్రాంతాలను కూడా చుట్టిరావచ్చు.
1. రామప్ప దేవాలయం
ములుగు జిల్లాలోనే మేడారంకు కేవలం 50-60 కిలోమీటర్ల దూరంలో ఈ రామప్ప ఆలయం ఉంటుంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ చారిత్రక ఆలయం అద్భుతమైన కళా నైపుణ్యం కలిగి ఉంటుంది. ఈ చారిత్రక ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది.
రామప్ప దేవాలయం పక్కనే అద్భుతమైన సరస్సు ఉంటుంది. ఇలా ప్రాచీన ఆలయ సందర్శన అనంతరం ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించవచ్చు. రామప్ప ఆలయం, చుట్టుపక్కల అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.
2. వేయిస్తంభాలు, భద్రకాళి టెంపుల్
మేడారంకు దగ్గర్లోనే వరంగల్ పట్టణం ఉంటుంది. ఇక్కడ కాకతీయుల కాలంనాటి కోటతో పాటు అనేక ప్రాచీన దేవాలయాలున్నాయి. వీటిలో ప్రధానమైనది వేయిస్తంబాల గుడి. కాకతీయుల శిల్పకళతో నిర్మించిన ఈ శివాలయం ఆకట్టుకుంటుంది. ఇక వరంగల్ లోని భద్రకాళి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.
లక్నవరం సరస్సు
ఇది ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం... జిల్లా కేంద్రానికి కేవలం 17 కి.మీ దూరంలో ఉంటుంది. మూడు కొండలమధ్య సహజసిద్దంగా ఏర్పడిన లక్నవరం సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుపై వేలాడే వంతెనలపై నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. సరస్సులో బోటింగ్ కూడా ఆకట్టుకుంటుంది.
బోగత, భీమునిపాదం వాటర్ పాల్స్
ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి సమీపంలో బోగత జలపాతం ఉంటుంది... దీన్ని తెలంగాణ నయాగరా గా పిలుస్తారు. పచ్చని అడవిలో అంతెత్తునుండి నీళ్లు పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతుంటే ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది.
ఇక భీమునిపాదం జలపాతం సహజసిద్దంగా ఏర్పడింది. ఇది పాండవులు వనవాస సమయంలో భీముని పాదం తాకడంవల్ల నీరు ఊరిందని... ఇప్పడికీ ఈ పాదం గుర్తులు జలపాతం పైన ఉంటాయని నమ్ముతారు. వరంగల్ పట్టణానికి 51 కి.మీ దూరంలో ఈ జలపాతం ఉంటుంది.
పాకాల సరస్సు
ఇది మానవనిర్మిత సరస్సు... దీన్ని కాకతీయ రాజులు నిర్మించారు. వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలో ఉంటుంది. ఈ సరస్సులో బోటింగ్ అద్భుతమమైన అనుభూతిని ఇస్తుంది.
ఏటూరు నాగారం అభయారణ్యం
ములుగు జిల్లాలోని మరో సందర్శనీయ ప్రాంతం ఈ ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం. ఈ ప్రాంతం జీవవైవిధ్యాన్ని కలిగివుంది. వివిధ రకాలు జింకలు, కుందేళ్ళు వంటి జీవులు కనిపిస్తాయి. చిరుత, పెద్దపులులు కూడా ఈ అటవీ ప్రాంతంలో కనిపిస్తాయి. వివిధ రకాల వృక్ష సంపదకు కూడా ఈ అభయారణ్యం నిలయం.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం
మేడారం జాతరకు వెళ్లేవారు కొండగట్టు ఆంజనేయస్వామిని కూడా దర్శించుకోవచ్చు. జగిత్యాల జిల్లాలోని ఈ పురాతన ఆలయంలో వెలిసిన ఆంజనేయ స్వామి భక్తుల కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. అందుకే పవన్ కల్యాణ్ లాంటి ప్రముఖులు కూడా స్వామిని భక్తితో కొలుస్తుంటారు,

