తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
Telangana: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో జీవో 46ను జారీ చేస్తూ, సర్పంచ్ పదవులూ, వార్డు స్థానాల రిజర్వేషన్ నియమాలు ఖరారు చేసింది.

రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టత
జీవో ప్రకారం రిజర్వేషన్లు మొత్తం స్థానాల 50 శాతానికి మించి ఉండకూడదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. రిజర్వేషన్ కేటగిరీల్లో SC, ST, BC, మహిళా కోటాలు రొటేషన్ సిస్టమ్లో అమలు కానున్నాయి. సర్పంచ్ పోస్టుల రిజర్వేషన్ కోసం 2011 జనగణన వివరాలు, SEEPC డేటాను ఆధారంగా తీసుకోనున్నారు.
పాత రిజర్వేషన్లపై మార్గదర్శకాలు
గత ఎన్నికల్లో రిజర్వ్ చేసిన గ్రామాలు లేదా వార్డులు అదే కేటగిరీకి మరోసారి కేటాయించరాదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019 ఎన్నికల్లో అమలుకాకుండా మిగిలిన రిజర్వేషన్లు ప్రస్తుత విధానంలో కొనసాగవచ్చని తెలిపింది. జిల్లా కలెక్టర్లతో పాటు స్థానిక ఎన్నికల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఎన్నికలు మూడు విడతల్లో
ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలోనే పోలింగ్ నిర్వహించేందుకు ప్రాథమిక ప్లాన్ సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి తుది ఆమోదం రాగానే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేయనుంది. డిసెంబర్ మూడో వారం లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని అంచనాలు ఉన్నాయి.
ఓటర్ల జాబితా అప్డేట్ జరుగుతోంది
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ లిస్టుల రీవ్యాలిడేషన్ పని ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 23 తేదీలోపు ఈ ప్రక్రియ ముగించాలని ఈసీ అధికారులకు సూచించింది. అదే రోజున తుది ఎన్నికల తేదీలు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల కానుంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తర్వాతే
ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలను ముందుగా పూర్తి చేసి, ఆ తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

