- Home
- Telangana
- Rain Alert: ఇంకా ఉంది.. తెలంగాణకు భారీ వర్ష సూచన. ఈ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాల్సిందే
Rain Alert: ఇంకా ఉంది.. తెలంగాణకు భారీ వర్ష సూచన. ఈ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాల్సిందే
గడిచిన మూడు రోజులుగా ఏపీతో పాటు తెలంగాణలో కూడా వర్షం దంచికొడుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో వరణుడు విశ్వరూపం చూపించాడు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అయితే ఈ వర్షం ఇంకా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

కుండపోత వర్షాలు
తెలంగాణలో వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు నీట మునిగి, అనేక ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలో కాలనీలన్నీ నీళ్లతో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాలకైతే రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది.
KNOW
కామారెడ్డి జిల్లాలో రికార్డు వర్షపాతం
కామారెడ్డి జిల్లా గత రెండు రోజులుగా కురిసిన కుండపోత వానలతో పూర్తిగా నీట మునిగిపోయింది. ఇక్కడ అత్యధిక వర్షపాతం నమోదైంది. గ్రామాలు, పట్టణాలు వరద నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. సిరిసిల్లాలోని నర్మాలా సమీపంలో వరదలో చిక్కుకున్న కొందరు రైతులను ఆర్మీ హెలికాప్టర్లలో రక్షించారు.
మరో రెండు రోజులు వర్షాలు
అయితే తెలంగాణలో వర్షం ఇప్పట్లో తగ్గేది లేదని అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రంతా పలు ప్రాంతాల్లో వర్షం కురవగా శుక్రవారం (ఆగస్టు 29) నుంచి మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 62–87 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. హన్మకొండ, కరీంనగర్, మెదక్, సిద్దిపేట సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది.
బంగాళాఖాతం ప్రభావం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినా దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వైపు కదులుతున్నప్పటికీ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలను కురిపించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు, మూడు రోజుల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సెలవులు, అప్రమత్తంగా ఉండాలని సూచన
పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. రవాణా, వ్యవసాయ పనులు, రోజువారీ కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. వరద ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు మానిటరింగ్ పెంచి, ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పవు.