భారీ వర్షాలతో అతలాకుతలం.. ఆదివారం వరకు స్కూళ్లకు సెలవులు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర తెలంగాణలో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి పట్టణం మొత్తం నీటిలో మునిగిపోయింది.

విద్యా సంస్థలకు సెలవులు
భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు (గురవారం) కామారెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. సిద్ధిపేట, కామారెడ్డి, రామాయంపేట, గంభీరావుపేట లాంటి ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కారణంగానే విద్యార్థులకు ఇబ్బంది కావొద్దన్న కారణంతో సెలవులు ప్రకటించారు.
KNOW
శుక్ర, శనివారం కూడా
అయితే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గురువారం కూడా భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లడంతో రహదారులు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలపై డీఈవో శుక్రవారం, శనివారం కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే ఇది కేవలం కామారెడ్డికే పరిమితమా ఇతర జిల్లాల్లో కూడా అమలు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
నిలిచిపోయిన రవాణా
వర్షాల దెబ్బకు రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయాయి. తక్కువ ప్రాంతాల్లో ఇళ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వాతావరణశాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కలెక్టర్ సూచనలు
జిల్లాలో పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతం, వాగులు, చెరువుల దగ్గర నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, చేపల వేట లేదా సరదా కోసం ఈతకు వెళ్లరాదని హెచ్చరించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో 08462-220183 నంబర్లోని కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆరోగ్య శాఖ అలర్ట్
వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గి తేమ పెరగడంతో మలేరియా, డెంగీ, చికున్గున్యా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇంటి వద్ద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం ‘డ్రైడే’ పాటించాల్సిందిగా అధికారులు సూచించారు. తాగునీటిని వడపోసి లేదా మరగబెట్టి వాడటం, బయట ఆహార పదార్థాలను మానుకోవడం మంచిదని తెలిపారు.
వైరల్ జ్వరాల నివారణ
గాలి ద్వారా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్లను నివారించేందుకు అనారోగ్యంతో ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని ఆరోగ్యశాఖ తెలిపింది. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సర్వీసులను ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ సిద్ధంగా ఉంచారు.