పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. మూడు దశల్లో పోలింగ్
Telangana Gram Panchayat Election : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్
తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 12,760 గ్రామాలు, 1,13,534 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికలను డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించే నిర్ణయాన్ని కమిషన్ వెల్లడించింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని మాట్లాడుతూ.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ ఉంటుంది. అనంతరం 2 గంటలకు లెక్కింపుప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రకటనతో ఎన్నికల నిబంధనలు (కోడ్) వెంటనే అమల్లోకి వచ్చినట్లుగా పేర్కొన్నారు.
నవంబర్ 27 నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు
నవంబర్ 27 నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడు రోజుల తర్వాత అంటే 30వ తేదిన రెండో దశ ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. చివరగా డిసెంబర్ 3న మూడో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.66 కోట్ల గ్రామీణ ఓటర్లు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, పంచాయతీ ఎన్నికల మొదటి షెడ్యూల్ను సెప్టెంబర్ 29న ప్రకటించిన తర్వాత, కొన్ని పరిపాలనా కారణాల వల్ల అక్టోబర్ 9న ఆ షెడ్యూల్పై నిలిపివేత (స్టే) అమలులోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.66 కోట్ల గ్రామీణ ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషనర్ తెలిపారు.
తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ నవంబర్ 27 (గురువారం) నుండి ప్రారంభమవుతుంది.
రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు
రెండో దశ ఎన్నికల నామినేషన్లు నవంబర్ 30 నుంచి స్వీకరించనున్నారు. ఈ దశలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డుల ఎన్నికలు నిర్వహించనున్నారు.
మూడో విడత నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 3 నుంచి ప్రారంభమవుతుంది. ఈ దశలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డుల కోసం పోలింగ్ జరగనుంది.
ఈ మూడు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమగ్రంగా సమయానుకూలంగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

