School College Bandh: జూలై 23న స్కూల్స్, కాలేజీలు బంద్
school college bandh: తెలంగాణలో విద్యాసంస్థల సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 23న బంద్కు పిలుపునిచ్చాయి. స్కూల్స్, కాలేజీలు మూతపడనున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telangana : జూలై 23న బంద్
విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం, అధికారుల నుంచి సరైన స్పందన లభించకపోవడంతో తెలంగాణలో వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. జూలై 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలలు బంద్కు పిలుపునిచ్చాయి.
పలు డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు విద్యార్థి సంఘాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో మంగళవారం విద్యార్థి సంఘాలు బంద్ పోస్టర్ను ఆవిష్కరించాయి.
బంద్ వెనుకున్న విద్యార్థి సంఘాల డిమాండ్లు ఇవే
వామపక్ష విద్యార్థి సంఘాలు పలు ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. వాటిలో ప్రధానంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశాయి.
అలాగే, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాడం, విద్యాశాఖకు తక్షణమే మంత్రి నియమించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ప్రభుత్వ విద్యాసంస్థల మౌలిక సమస్యలను లేవనెత్తిన విద్యార్థి సంఘాలు
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సమస్యలను కూడా విద్యార్థి సంఘాలు లేవనెత్తాయి. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిధుల కేటాయింపు, ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల విడుదల వంటి అంశాలపై విద్యార్థి సంఘాలు పోరాటానికి దిగుతున్నాయి. విద్యార్థుల ప్రయాణానికి ఉచితంగా ఆర్టీసీ బస్ పాస్ల అవసరాన్ని కూడా విద్యార్థి సంఘాలు ప్రస్తావించాయి.
నూతన విద్యా విధానం (NEP) 2020పై అభ్యంతరాలు
నూతన విద్యా విధానం (NEP 2020) తెలంగాణలో అమలును ఆపాలని, అసెంబ్లీలో దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ విధానం విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు నెట్టేస్తుందనీ, సామాన్య విద్యార్థులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు బంద్ పిలుపు
ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు.. విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయ సంఘాలను బంద్కు మద్దతు తెలపాలని కోరుతున్నాయి. ప్రభుత్వ స్పందన రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ (AISF) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ (SFI) రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, “విద్యార్థుల హక్కులను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను విజయవంతం చేస్తామని” అన్నారు. ఈ బంద్ విద్యార్థుల హక్కులను కాపాడే దిశగా ముఖ్యమైన మైలురాయిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.