- Home
- International
- Iran: ఇరాన్లో వేల కోట్ల పెట్టుబడి పెట్టిన భారత్.. అసలు దీంతో మనకేంటీ ఉపయోగం
Iran: ఇరాన్లో వేల కోట్ల పెట్టుబడి పెట్టిన భారత్.. అసలు దీంతో మనకేంటీ ఉపయోగం
Iran: ఇజ్రాయెల్-అమెరికా జరుపుతోన్న సంయుక్త దాడులతో ఇరాన్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయినా తగ్గేదేలే అన్నట్లు ఇరాన్ ప్రతిదాడి చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్లో భారత్ పెట్టిన భారీ పెట్టుబడుల గురించి తెలుసుకుందాం.

ఇరాన్లోని ప్రాజెక్టులపై ప్రభావం
ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాలు ఇరాన్లోని కీలక ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యమైంది భారత్ పెట్టుబడి పెట్టిన చాబహార్ పోర్ట్. ఈ పోర్ట్ భారతదేశానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. భారత్ ఈ పోర్ట్ అభివృద్ధి కోసం సుమారు 120 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1100 కోట్లు) ప్రత్యక్ష పెట్టుబడిగా ఖర్చు చేసింది.
ఈ మొత్తాన్ని ప్రధానంగా టర్మినల్ అభివృద్ధి, భారీ క్రేన్లు ఏర్పాటు, సరుకు లోడింగ్, అన్లోడింగ్ సదుపాయాల మెరుగుదల, ఆపరేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్, ఇవి పోర్ట్ పనితీరును మెరుగుపరచేందుకు ఉపయోగించారు. దీంతో పాటు భారత్ మరో 250 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ (దాదాపు రూ. 2100 కోట్లు) ఇచ్చింది. ఈ నిధులు ఇరాన్ ద్వారా ఆఫ్ఘానిస్తాన్, సెంట్రల్ ఏషియా దేశాలతో రవాణా మార్గాల అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టుల కోసం వినియోగిస్తారు.
భారత్కు ఈ పోర్ట్ ఎందుకు అంత ముఖ్యము?
చాబహార్ పోర్ట్ ద్వారా భారత్కు మూడు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి.
పాకిస్తాన్ను బైపాస్ చేసే మార్గం:
భారత్ నుంచి ఆఫ్ఘానిస్తాన్, సెంట్రల్ ఏషియా దేశాలకు సరుకులు పంపేందుకు పాకిస్తాన్ భూభాగం మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండేది. చాబహార్ పోర్ట్ వల్ల ఆ అవసరం తగ్గింది.
ఆఫ్ఘానిస్తాన్తో నేరుగా వ్యాపారం:
ఆఫ్ఘానిస్తాన్కు గోధుమలు, ఔషధాలు, నిర్మాణ సామగ్రి వంటి సరుకులను భారత్ నేరుగా పంపగలుగుతోంది.
యూరప్కు వేగవంతమైన మార్గం:
ఈ పోర్ట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (INSTC)తో అనుసంధానమై ఉంది. దీని ద్వారా ఇరాన్–రష్యా మార్గంగా యూరప్కు సరుకులు తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో చేరే అవకాశం ఉంది.
దీంతో భారతీయులకు ఉపయోగం ఏంటి?
చాబహార్ ప్రాజెక్ట్ వల్ల భారతీయులకు పరోక్షంగా పెద్ద ప్రయోజనం ఉంటుంది. దీంతో ఎగుమతులు పెరుగుతాయి, వ్యాపార అవకాశాలు విస్తరిస్తాయి, పోర్ట్, లాజిస్టిక్స్ రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి, దిగుమతుల ఖర్చు తగ్గే అవకాశం లభిస్తుంది. దీర్ఘకాలంలో ఇది భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే వ్యూహాత్మక పెట్టుబడి.
ప్రస్తుత ఆర్థిక కేటాయింపుల పరిస్థితి
2026–27 యూనియన్ బడ్జెట్లో చాబహార్ ప్రాజెక్ట్కు కొత్తగా నిధులు కేటాయించలేదు. అయితే గత ఏడాది సవరించిన అంచనాల్లో సుమారు రూ. 400 కోట్లు కేటాయించారు. ఇది ప్రాజెక్ట్ కొనసాగింపునకు మద్ధతుగా భావిస్తారు.
ఇప్పుడు పరిస్థితి ఏంటి?
ఇరాన్లో నాయకత్వ మార్పు జరిగితే దీర్ఘకాల ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. భారత్ 2024లో చాబహార్ పోర్ట్ నిర్వహణ కోసం 10 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని ఎలా కొనసాగిస్తుందో అనేది కీలకంగా మారింది. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన కఠిన ఆంక్షల వల్ల ఇరాన్లో పెట్టుబడులు పెట్టే దేశాలకు ఇబ్బందులు పెరిగాయి.

