- Home
- Telangana
- Rain Alert: తీరం దాటిన వాయు గుండం.. వచ్చే 4 రోజులు ఈ ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాల్సిందే. వానలే వానలు
Rain Alert: తీరం దాటిన వాయు గుండం.. వచ్చే 4 రోజులు ఈ ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాల్సిందే. వానలే వానలు
గడిచిన కొన్ని రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తడిసి ముద్దవుతున్నాయి. కాగా వాయుగుండం తీరం దాటడంతో ఆ ప్రభావం మరింత ఎక్కువ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

వచ్చే నాలుగు రోజులు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తరాంధ్ర తీరం దాటింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాల ప్రభావం పెరిగింది. విశాఖ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం, రాబోయే నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని అంచనా. తీర ప్రాంతాల్లో గంటకు 45–55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరిక జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి
అల్పపీడనం కారణంగా శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసింది.
ముంచింగిపట్టులో అత్యధికంగా 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో వరి నాట్లు, పత్తి, అపరాల పంటలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించాయి. ఐదారురోజులుగా కురుస్తున్న వానలతో పంటలు పుంజుకున్నాయని రైతులు చెబుతున్నారు.
తెలంగాణలో భారీ వర్ష సూచన
తెలంగాణలో కూడా వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగాం వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతన్నాయి. కాగా మధ్య తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పెరుగుతోన్న గోదావరి నీటి మట్టం
కొనసాగుతున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 32.5 అడుగులకు చేరుకుంది. దీంతో పర్ణశాల పర్యాటక ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. గత 24 గంటల్లో పాల్వంచలో 10 సెంటీమీటర్లు, కోటగిరిలో 7 సెంటీమీటర్లు, ఇల్లెందులో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
విపత్తు నిర్వహణ చర్యలు, సూచనలు
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. వరదలు వచ్చే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాలను దాటరాదని విజ్ఞప్తి చేశారు.