హైదరాబాద్ సమీపంలో రహస్య జలపాతం.. ఈ వీకెండ్కి ప్లాన్ చేస్తే ఎంజాయ్మెంట్ పక్కా
ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తుంటారు. అయితే హైదరాబాద్కు చేరువలో అలాంటి అద్భుత ప్రదేశం ఉందని మీలో ఎంత మందికి తెలుసా.?

మహితాపురం జలపాతం
హైదరాబాద్ నుంచి కేవలం ఐదు గంటల ప్రయాణ దూరంలో, తెలంగాణా అరణ్యాల మధ్యలో ఒక అందమైన ప్రదేశం ఉంది. అయితే ఈ ప్రదేశం గురించి ఇప్పటికీ చాలా మందికి తెలిసి ఉండదు. వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే ఎన్నో మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్, పచ్చదనం, ప్రకృతి నిశ్శబ్దం అన్నీ కలిపి ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి.
మహితాపురం జలపాతం ప్రత్యేకత
మహితాపురం జలపాతం దట్టమైన అరణ్యాలు, రాళ్లతో నిండిన కొండచరియల మధ్యలో ఉంది. వర్షాకాలంలో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ, పచ్చదనంతో కూడిన అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఇతర ప్రసిద్ధ జలపాతాల్లా ఇక్కడ జనసందోహం ఉండదు. నీటి శబ్దం, పక్షుల కిలకిలరావం, అడవిలో చల్లని గాలి ఇవన్నీ కలిపి సందర్శకులకు ప్రశాంతతను ఇస్తాయి.
వర్షాకాలంలో అందమైన రూపం
ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది. అరణ్య మార్గాల్లో చిన్న ట్రెక్కింగ్ చేస్తూ జలపాతం దాకా వెళ్లొచ్చు. మధ్యలో పచ్చటి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఫోటోగ్రఫీకి, చిన్న పిక్నిక్కి, లేదా ప్రకృతిలో నిశ్శబ్దంగా కూర్చునేందుకు ఇది సరైన ప్రదేశం.
ఎలా చేరుకోవాలి?
మహితాపురం జలపాతం, ములుగు జిల్లా వెంకటాపురంలో ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు 280 కి.మీ దూరం. స్థానిక రవాణా సదుపాయాలు తక్కువగా ఉండటంతో సొంత వాహనంలో వెళ్లడమే మంచిది. హైదరాబాద్ నుంచి అడ్వెంచర్ గ్రూపులు కూడా ఇక్కడికి ట్రెక్కింగ్ టూర్లు నిర్వహిస్తుంటాయి. సాధారణంగా మహితాపురం జలపాతాన్ని, దగ్గరలోని మరికొన్ని జలపాతాలను కలిపి ప్యాకేజీలుగా తీసుకువెళ్తారు.
సందర్శించడానికి సరైన సమయం
మహితాపురం జలపాతాన్ని చూడటానికి ఉత్తమ సమయం వర్షాకాలం, వర్షాల తరువాతి నెలలు. కానీ జాగ్రత్త తప్పనిసరి. వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదకరంగా మారుతుంది. అధికారులు పలు సార్లు ఇక్కడ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు, సురక్షితంగా ప్రయాణాన్ని ప్లాన్ చేయడం మంచిది. మరీ ముఖ్యంగా ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిది.