Rain Alert : అల్పపీడనం తీరందాటే సమయమిది... ఈ తెలంగాణ, ఏపీ జిల్లాల్లో కుండపోత తప్పదా..!
తెెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరోసారి జోరందుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ ఏఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందో ఇక్కడ తెలుసుకుందాం.

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Telangana and Andhra Pradesh Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. ఇటీవల కురిసిన అత్యంత భారీ వర్షాలు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణలో అయితే పలుజిల్లాల్లో భీకరమైన వరదలు సంభవించాయి... కామారెడ్డి, మెదక్ వంటి జిల్లాల ప్రజలు ఇంకా వరద భయం నుండి బయటకురాలేదు. ఇలాంటి సమయంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి... మరికొద్దిరోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి..
తీరం దాటనున్న అల్పపీడనం
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ, రేపు (బుధ, గురువారం) రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని... ఇది ఇవాళ ఒడిషా సమీపంలో తీరాన్ని దాటవచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటాయని... అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
నేడు (బుధవారం) తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, జనగాం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :02-09-2025@TelanganaCS@DCsofIndia@IASassociation@TelanganaDGP@TelanganaCMO@GHMCOnline@HYDTP@IasTelangana@tg_weather@CommissionrGHMC@Comm_HYDRAA@Indiametdeptpic.twitter.com/q0nkRhBjgL
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 2, 2025
తెలంగాణ ప్రజలు జాగ్రత్త..
ఈ వర్షాలకు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా తోడవుతాయని హెచ్చరించింది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని... కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది... అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి... రాష్ట్రవ్యాప్తంగా జల్లులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ (బుధవారం) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఇక విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తీరం వెంబడి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి... కాబట్టి ఆ ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరిస్తోంది.