- Home
- Telangana
- Liquor prices Hike : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు.. తెలుగు మందుబాబులపై ఇరాన్ వార్ ఎఫెక్ట్..!
Liquor prices Hike : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు.. తెలుగు మందుబాబులపై ఇరాన్ వార్ ఎఫెక్ట్..!
Liquor prices Hike : ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో యుద్దం జరిగితే తెలంగాణలో లిక్కర్ ధరలు పెరగడమేంటి…? వేసవిలో చల్లచల్లని బీర్లు తాగుదామునుకనేవారి గొంతుకు యుద్దం అడ్డుపడటం ఏంటి..?

తెలంగాణలో ఆల్కహాల్ ధరల పెంపు..
Liquor prices Hike : ''ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది'' అన్నట్లుంది తెలంగాణ పరిస్థితి. ఎక్కడో మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్దం జరుగుతుంటే ఇక్కడ ఆల్కహాల్ ధరలు పెరుగుతాయట. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు కూడా మందు రేట్లు పెరగడానికి కారణం కానున్నాయి. మొత్తంగా వేసవికాలంలో మండుటెండల నుండి ఉపశమనం కోసం చల్లచల్లని బీర్లు తాగుదామనుకునేవారికి ధరలు చూస్తేనే మత్తెక్కిపోయే పరిస్థితి వచ్చేలా ఉంది.
లిక్కర్ ధరలపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ఎఫెక్ట్..
తెలంగాణలో లిక్కర్ ధరలు పెరిగే అవకాశం బలంగా కనిపిస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి... వీటిలో ప్రధానమైనది ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై దాడులు చేయడం. ఇదే సమయంలో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులకు దిగడంతో ఇండియాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి... ఇప్పుడు ఆల్కహాల్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
గాజు సీసాల తయారీలో సహజవాయువులను ఉపయోగిస్తుంటారు... ఇది ఎక్కువగా మిడిల్ ఈస్ట్ దేశాలనుండే ఇండియాకు దిగుమతి అవుతాయి. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది... దీంతో గాజు సీసాల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దేశవ్యాప్తంగా గాజు సీసాల ఉత్పత్తి 40 శాతం పడిపోవడంతో ఆటోమేటిగ్గా ఆల్కహాల్ తయారీ కంపెనీలపై భారం పెరిగింది. ఈ పెరిగిన భారాన్ని వినియోగదారులపై వేసేందుకు డిస్టిలరీ కంపెనీలు సిద్దమయ్యాయి.
వచ్చే నెల మే నుండి మందు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 12 నుండి 15 శాతం ఆల్కహాల్ ధరలు పెంచేందుకు సిద్దమయిన డిస్టిలరీస్ యాజమాన్యాలు ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కూడా కోరినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా ఆల్కహల్ ధరల పెంపుకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఇక మందుబాబులపై మరింత భారం తప్పదన్నమాట.
కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్ ఎఫెక్ట్..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు కూడా ఆల్కహాల్ ధరలు పెరుగుతాయనే సంకేతాలు ఇస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ.40 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని మరింత పెంచుకోనున్నట్లు బడ్జెట్ 2026 లో ప్రభుత్వం ప్రకటించింది. అంటే ధరలు పెంచనున్నట్లు ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.
ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్కహాల్ ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఇటీవల బడ్జెట్ లో కస్టమ్స్ ఆండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లను మార్చింది... ఇది కూడా అన్నిరకాల మందు ధరలను ఎఫెక్ట్ చేయనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆల్కహాల్ ధరలు పెరిగాయి... తెలంగాణలో కూడా త్వరలోనే పెరిగే అవకాశాలున్నాయి.
ఆల్కహాల్ ధరలు పైపైకి...
2025 లో కూడా ఇలాగే ఆల్కహాల్ ధరలు పెరిగాయి. క్వార్టర్ బాటిల్పై ₹10, ఫుల్ బాటిల్పై ₹40 వరకు ధరలను పెంచింది. అదే బాటలో ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు కూడా ధరల సవరణ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2026లో ఇప్పటికే బీర్ ధరలను 15% నుండి 19% వరకు (బాటిల్కు సుమారు ₹30 నుండి ₹50 వరకు) పెంచారు. మరోసారి పెంపుకు డిస్టిలరీస్ సిద్దమయ్యాయి.
వైన్ షాపుల అప్లికేషన్ ఫీజు పెంపు..
2025-27 కాలానికి వైన్ షాపుల అప్లికేషన్ ఫీజును రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలకు పెంచడం జరిగింది. దీనివల్ల వ్యాపారులపై పడే భారం పరోక్షంగా వినియోగదారులపై పడే అవకాశం ఉంది. ఇది కూడా వైన్ షాపుల ధరల పెంపుకు కారణం అవుతోంది.
ప్రభుత్వం అధికారికంగా అన్ని రకాల ఆల్కహాల్ ధరల పెంపును ఇంకా ప్రకటించలేదు, కానీ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం మే నెలలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వేసవి కాలం కావడంతో బీర్ల డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, సరఫరా కొరత కూడా ధరలపై ప్రభావం చూపవచ్చు.

