Monsoon : ఈ ఏడాది వర్షాల దెబ్బ.. రుతుపవనాల పై ఐఎండీ షాకింగ్ అప్డేట్
Weather Update: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. జూన్ 3 తర్వాతే కేరళను తాకే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం కూడా భారీగా తగ్గుతుందని ఐఎండీ హెచ్చరించింది.

రుతుపవనాల రూట్ మారింది.. జూన్ 3 తర్వాతే ఎంట్రీ! అస్సలు రీజన్ ఏంటంటే?
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకవైపు ఎండలు, మరోవైపు వానలతో విచిత్ర వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ విభాగం (IMD) రుతుపవనాల పై షాకింగ్ న్యూస్ చెప్పింది. సాధరణం కంటే లేట్ గానే ఈ సారి రుతుపవనాలు వస్తాయని పేర్కొంది.
భారతదేశ వ్యవసాయ రంగానికి జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు.. సాధారణంగా మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలోనే భారత ఉపఖండంలోకి ఎంట్రీ ఇస్తాయి. మే 26నే వానలు ముందే స్టార్ట్ అవుతాయంటూ ఐఎండీ గతంలో వేసిన అంచనా తప్పింది. కానీ, రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపింది.
గాలులు వీక్.. రుతుపవనాలు ఎంట్రీ లేట్
ప్రస్తుతం సముద్రంపై గాలులు చాలా బలహీనంగా ఉన్నందున వర్షాల ప్రారంభం ఆలస్యమవుతోందని, ఇది జూన్ 3 తర్వాతే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేరళలోని నిర్ణీత 60 శాతం ప్రాంతాల్లో ఇప్పటికే వానలు పడాల్సింది. కానీ ప్రస్తుతం పశ్చిమ గాలులు మరీ వీక్గా మారడమే ఈ లేట్కి మెయిన్ రీజన్.
గత దశాబ్ద కాలపు డేటాను చూస్తే, 2016, 2023 సంవత్సరాలలో రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 8న వచ్చాయి. అయితే 2024 (మే 30), 2025 (మే 24)లలో మాత్రం టైమ్ కంటే ముందే ఇండియాలోకి వచ్చేశాయి. ఈ శతాబ్దంలోనే అత్యంత ముందస్తుగా 2004 మే 18న రుతుపవనాలు రావడం విశేషం.
2005 నుండి 2025 మధ్య కాలంలో 2015 మినహా ఐఎమ్డి చేసిన ప్రెడిక్షన్స్ అన్నీ దాదాపు నిజమయ్యాయి. ఈ ఏడాది మే 16 నాటికే, అంటే షెడ్యూల్ కంటే వారం ముందే అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ఎంటర్ అయినప్పటికీ, మెయిన్ ల్యాండ్లోకి రావడానికి మాత్రం బ్రేక్ పడింది. అయితే జూన్ 8వ తేదీ వరకు రుతుపవనాలు రాకపోయినా, దానిని తీవ్రమైన ఆలస్యంగా పరిగణించలేమని ఐఎండీ అంటోంది.
ఏ ఏరియాకి ఎప్పుడు రుతుపవనాలు వస్తాయి?
నిపుణుల ప్రకారం.. జూన్ 3 తర్వాత కేరళలో కొంచెం స్లోగా రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఇవి తమిళనాడు, తీరప్రాంత కర్ణాటక మీదుగా స్ప్రెడ్ అవుతాయి. ఈశాన్య భారతదేశంలో జూన్ 5-10 మధ్య, తూర్పు భారతదేశంతో పాటు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలలో జూన్ 10 తర్వాతే ఇవి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం వీక్గా ఉన్న గాలులు, పశ్చిమ పసిఫిక్లో ఫామ్ అయిన జాంగ్మీ తుపాను కారణంగా వచ్చే వారంలో కొంత పికప్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా. జూన్ మొదటి అర్ధభాగంలో దేశంలోని చాలా ఏరియాల్లో యావరేజ్ కంటే తక్కువ వర్షపాతమే నమోదు కావచ్చని ఇంటర్నేషనల్ వెదర్ మోడల్స్ చెప్తున్నాయి.
వానలపై ఎల్ నినో ఎఫెక్ట్
ఈ పరిణామాల మధ్య ఐఎండీ దేశానికి ఒక చేదు వార్తను మోసుకొచ్చింది. ఈ ఏడాది వర్షపాతం తగ్గడానికి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రభావమే కారణమని వెల్లడించింది. జూన్-సెప్టెంబర్ సీజన్కు సంబంధించి దేశవ్యాప్త వర్షపాత అంచనాను గత నెల దీర్ఘకాల సగటు లో 92% నుండి 90%కి ఐఎండీ తగ్గించేసింది. ఇది సాధారణం కంటే తక్కువ వర్షపాతం. వానలు లోటుగా లేదా తక్కువ స్థాయిలో కురిసేందుకు ఏకంగా 84% ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీన్ని బట్టి చూస్తే, ఈ ఏడాది రుతుపవనాలు 2015 తర్వాత అత్యంత బలహీనమైనవిగా మారే రిస్క్ కనిపిస్తోంది.
అగ్రి సెక్టార్పై ఇంపాక్ట్ ఎంత?
సాధారణంగా జూన్ ప్రారంభంలో కేరళలో స్టార్ట్ అయి జూలై నాటికి దేశమంతటా విస్తరించే నైరుతి రుతుపవనాలు, దేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంటాయి. ఇవి సెప్టెంబర్ మధ్య నుండి ఉత్తర భారతదేశం వైపుగా క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఈ వానల బేస్తోనే దేశంలో ఖరీఫ్ పంటలైన వరి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల విత్తనాలు వేయడం మొదలవుతుంది.
అంతేకాకుండా, ఈ వర్షాలు శీతాకాలపు రబీ పంటలైన గోధుమ, పప్పుధాన్యాలకు నేలలో అవసరమైన తేమను ఇస్తాయి. కేరళకు కొద్దిరోజులు ఆలస్యంగా నైరుతి వచ్చినంత మాత్రాన పెద్దగా సమస్యలు రావని నిపుణులు చెబుతున్నా, టోటల్గా వర్షపాతం తగ్గుతుందనే ఐఎండీ హెచ్చరికలు అగ్రి సెక్టార్ ఉత్పత్తిపై, దేశ ఆర్థిక రంగానికి గట్టి షాక్ ఇచ్చేలా ఉంది. అందుకే రైతాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

