- Home
- Telangana
- Heavy Rain Alert : చిరుజల్లులు కాదు ఇక భారీ, అతిభారీ వర్షాలే... ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!
Heavy Rain Alert : చిరుజల్లులు కాదు ఇక భారీ, అతిభారీ వర్షాలే... ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు సాధారణ చిరుజల్లులే కురిశాయి. అయితే ఈ నెలాఖరులో భారీ వర్షాలు కురుస్తాయని వాాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు...
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టేలా లేవు... వర్షాకాలంలో ఎలాగూ వానలు పడతాయి. చలి, ఎండాకాలంలోనూ వానలు కురుస్తున్నాయి... అంటే సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తున్నాయన్నమాట. ఈ వేసవి మొదలైనప్పటి నుండి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి... నడి వేసవిలోనూ భారీ వర్షాలు తప్పేలా లేవు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తుండగా నెలాఖరుకు జోరందుకుంటాయని... భారీ వర్షాలు తప్పవని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు కొనసాగుతున్నాయి... ఏకంగా 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరున ఎండల నుండి కాస్త ఉపశమనం లభించనుంది... ఏప్రిల్ 28, 29న తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఆసిఫాబాద్ నుండి సూర్యాపేట వరకు గల తుర్పు జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
ఏపీలోనూ భారీ వర్షాలు
కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. శ్రీకాకుళం నుండి గుంటూరు వరకు నార్త్, సెంట్రల్ ప్రాంతాల్లో వర్షాలుంటాయట. ఏప్రిల్ ఎండింగ్ లో ప్రారంభమయ్యే వానలు మే 1 వరకు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈసారి చెదురుమదురు జల్లులు కాదు వర్షబీభత్సమే ఉండేలా కనిపిస్తుంది.
ఈ జిల్లాల్లో వర్షాలు..
ఇదిలావుంటే ఇవాళ (ఏప్రిల్ 24) కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 35-40 కి.మీ వేగంతో) కూడిన వర్షాలుంటాయని హైదరాబాద్ వాతవారణ కేంద్రం హెచ్చరించింది... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ముందుగానే నైరుతి రుతువనాల ఎంట్రీ..
ఇక గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ముందుగానే నైరుతి రుతుపవనాలు ఇండియాలోకి ఎంటరయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంటే వర్షాకాలం కాస్త ముందుగానే ప్రారంభం అవుతుందన్నమాట. మే 18 నుండి 25 తేదీల మధ్య అండమాన్ నికోబార్ కు... జూన్ 1 లోపు కేరళ, తమిళనాడును రుతుపవనాలు తాకుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది కూడా మేలోనే రుతుపవనాలు ఇండియాకు చేరుకున్నారు... కానీ తర్వాత ముఖం చాటేశాయి. అయితే తర్వాత పుంజుకుని అత్యంత భారీ వర్షాలు కురిశాయి.

