- Home
- Telangana
- Hyderabad: అద్దె ఇంట్లో ఉంటున్నారా.? ఓసారి బల్బులు చెక్ చేసుకోండి. హైదరాబాద్లో షాకింగ్ సంఘటన
Hyderabad: అద్దె ఇంట్లో ఉంటున్నారా.? ఓసారి బల్బులు చెక్ చేసుకోండి. హైదరాబాద్లో షాకింగ్ సంఘటన
Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో కలవరపరిచే ఘటన బయటపడింది. షాపింగ్ మాల్స్, మహిళా హాస్టల్స్ తర్వాత ఇప్పుడు అద్దె ఇళ్లలో కూడా ప్రైవసీకి రక్షణ లేకుండా పోయిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

బాత్రూమ్లో కెమెరా పెట్టిన ఇంటి యజమాని
జవహార్నగర్కు చెందిన అశోక్ యాదవ్ అనే వ్యక్తి తన ఇంట్లో అద్దెకు ఉన్న ఓ దంపతులపై కన్నేశాడు. ఆ దంపతులు ఉదయం ఉద్యోగాలకు వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో ఇంటి తాళాలు తన దగ్గర ఉండడాన్ని ఉపయోగించుకున్నాడు. ఈనెల 4వ తేదీ ఉదయం “లైట్ హోల్డర్ మార్చాలి” అంటూ ఇంటిలోకి వెళ్లి, బాత్రూమ్లో సీసీ కెమెరా అమర్చాడు.
బల్బ్ హోల్డర్లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు
అశోక్ యాదవ్, ఎలక్ట్రీషియన్ చింటూ సహాయంతో బాత్రూమ్లోని బల్బ్ హోల్డర్ లోపల కెమెరా అమర్చాడు. స్క్రూలు పట్టకపోవడంతో టేప్ వేసి బల్బ్ని బిగించాడు. ఆ కెమెరాను తన మొబైల్కి కనెక్ట్ చేసి, మహిళ స్నానం చేసే దృశ్యాలను ప్రత్యక్షంగా చూసేవాడు. ఆ వీడియోలను రికార్డ్ చేసి, ఎలక్ట్రీషియన్ చింటూకు కూడా పంపేవాడని పోలీసుల విచారణలో తేలింది.
అనుమానం ఎలా వచ్చిందంటే
ఈనెల 13న మహిళ స్నానం చేస్తున్న సమయంలో బాత్రూమ్ లైట్ బ్లింక్ అవ్వడం గమనించింది. ఈ విషయాన్ని వెంటనే ఆమె భర్తకు తెలిపింది. వారు ఆ విషయం ఓనర్కి చెప్పగా, “నాకు తెలియదు, ఎలక్ట్రీషియన్ను అడుగుతాను” అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమాధానంతో అనుమానం వచ్చిన దంపతులు వెంటనే షీటీమ్కు ఫిర్యాదు చేశారు.
షీటీమ్ దర్యాప్తు, నిందితుల అరెస్ట్
ఫిర్యాదు అందుకున్న షీటీమ్ పోలీసులు అశోక్ యాదవ్ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. బాత్రూమ్లో అమర్చిన కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. తరువాత కేసును మధురానగర్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు. చింటూ అనే ఎలక్ట్రీషియన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రికార్డ్ చేసిన వీడియోలను వెబ్సైట్లలో అప్లోడ్ చేశారా, లేక మరెవరికైనా పంపారా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
అద్దెదారుల్లో భయాందోళన
ఈ ఘటనతో అద్దె ఇళ్లలో ఉండే కుటుంబాలు భయాందోళనకు గురయ్యాయి. బాత్రూమ్, బెడ్రూమ్ల వంటి ప్రైవేట్ ప్రదేశాల్లో కూడా కెమెరాలు ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే షీటీమ్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.