Hyderabad: పెరుగుతోన్న అద్దెలు.. హైదరాబాద్లో హాట్స్పాట్లు ఇవే..
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకీ పెరుగుతుంది. ముఖ్యంగా రిటైల్ స్పేస్కు డిమాండ్ పెరుగుతోంది. తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో ఇందుకు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలుగులోకి వచ్చాయి.

విస్తరిస్తోన్న రియల్ ఎస్టేట్
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఇళ్ల, కమర్షియల్ ఆఫీస్లతో పాటు రిటైల్ స్పేస్కూ విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో 2025 రెండో త్రైమాసికం (Q2)లో దేశంలోని ప్రధాన నగరాల కంటే ఎక్కువ లీజులు హైదరాబాద్లోనే జరిగాయని వెల్లడించింది.
2025 మొదటి అర్ధ భాగం (H1)లో హైదరాబాద్లో మొత్తం 15 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు పూర్తయ్యాయి. ఇలోగా రెండో త్రైమాసికం (Q2)లోనే 8 లక్షల చ.అ. స్పేస్ లీజింగ్ జరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11 శాతం వృద్ధి సాధించింది.
2027 నాటికి 28 లక్షల చ.అ అందుబాటులోకి
ఈ నివేదిక ప్రకారం, 2027 నాటికి నగరానికి సుమారు 28 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ సరఫరా అందుబాటులోకి రానుంది. ఇందులో వచ్చే రెండు త్రైమాసికాలపాటు సుమారు 17 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ వాడుకలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వృద్ధి, నగరంలోని మాల్స్, హై స్ట్రీట్ మార్కెట్లలో మరింత చురుకుదనాన్ని తీసుకురానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎఫ్అండ్బీ, ఫ్యాషన్ బ్రాండ్ల ఆధిక్యం
రిటైల్ లీజుల్లో ఫుడ్ అండ్ బేవరేజెస్ (F&B) బ్రాండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ విభాగం వాటా 34 శాతం కాగా, ఫ్యాషన్ బ్రాండ్ల వాటా 14 శాతంగా ఉంది. కొత్త గ్రేడ్-ఏ మాల్స్ ప్రారంభం కానందున, ప్రస్తుత మాల్స్లో ఖాళీ రేటు కేవలం 1.85 శాతం మాత్రమే ఉంది.
హై స్ట్రీట్ అద్దెల పెరుగుదల
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హై స్ట్రీట్ ప్రాంతాల్లో రిటైల్ అద్దెలకు ఎక్కువ డిమాండ్ ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అద్దెలు 13.6 శాతం పెరిగాయి. అత్తాపూర్, మదీనాగూడ, చందానగర్ ప్రాంతాల్లో కూడా అద్దెలు స్థిరంగా పెరుగుతున్నాయి.
కొత్త హాట్స్పాట్లుగా బాచుపల్లి, కొంపల్లి
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది రెండో త్రైమాసికం (Q2)లో మొత్తం 22.4 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు జరిగాయి. ఇందులో హైదరాబాద్ ప్రాధాన్యం ఎక్కువ. ముఖ్యంగా బాచుపల్లి, కొంపల్లి వంటి పరిసర ప్రాంతాలు హాట్స్పాట్లుగా ఎదుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో Q2లో 57 శాతం లీజులు నమోదయ్యాయి. అలాగే అమీర్పేట, నిజాంపేట వంటి ప్రధాన ప్రాంతాల్లో 43 శాతం లీజింగ్ కార్యకలాపాలు జరిగాయి.