Hyderabad: మారనున్న హైదరాబాద్ భవితవ్యం.. రూ. 43 వేల కోట్లతో కీలక ప్రాజెక్ట్
హైదరబాద్ భవితవ్యం మారనుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యంగా మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం, మెట్రో అధికారులు అడుగులు వేస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మెట్రో రెండో దశలో కీలక ముందడుగు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా ‘బి’ విభాగం కింద ప్రతిపాదించిన మూడు కారిడార్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు (DPRs) పూర్తయ్యాయి. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి మేడ్చల్, శామీర్పేట్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునే మార్గాన్ని ఈ దశలో చేర్చారు. మొదటి ఐదు కారిడార్లతో పాటు ఈ మూడు కారిడార్లను రెండో దశలో నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
త్వరలో కేంద్రానికి పంపనున్న డీపీఆర్లు
ఈ మూడు కొత్త కారిడార్ల ప్రాజెక్ట్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత త్వరలో కేంద్రానికి పంపనున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకారం, ఈ నివేదికలు ఈ నెల 8న బోర్డు ఆమోదం పొందినట్టు తెలిపారు. కేంద్రం నుంచి గ్రీన్సిగ్నల్ వస్తే వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
మెట్రో హబ్గా జేబీఎస్ కారిడార్లు
జేబీఎస్ (జుబిలీ బస్ స్టేషన్) ప్రాంతంలో అత్యాధునిక మెట్రో హబ్ను అభివృద్ధి చేయనున్నారు. ఇది ప్రయాణికుల రవాణాకు ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్కు వెళ్లే 24.5 కి.మీ మార్గంలో 18 మెట్రో స్టేషన్లు, అలాగే శామీర్పేట్కు వెళ్లే 22 కి.మీ మార్గంలో 14 స్టేషన్లను ప్రతిపాదించారు. కారిడార్ల మధ్య మారడం సులభంగా ఉండేందుకు స్కైవాక్లను ఏర్పాటు చేయనున్నారు.
రూ. 19,579 కోట్ల అంచనా వ్యయంతో మూడు కొత్త కారిడార్లు
‘బి’ విభాగం కింద ప్రతిపాదించిన ఈ మూడు కారిడార్లు కలిపి 86.1 కి.మీ పొడవుగా ఉండనున్నాయి. వీటి నిర్మాణానికి సుమారుగా రూ.19,579 కోట్లు ఖర్చు అయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ప్రతిరోజూ దాదాపు 3 లక్షల మంది ప్రయాణించే అవకాశముందని భావిస్తున్నారు.
మొత్తం రెండో దశ వ్యయం రూ. 43,579 కోట్లు
మెట్రో రెండో దశలో మొత్తం 8 కారిడార్లను చేపట్టనున్నారు. వీటి పొడవు మొత్తం 162 కి.మీ. కాగా, మొత్తం వ్యయం రూ.43,579 కోట్లు ఉండనుంది. మొదటి 5 కారిడార్లకు ఇప్పటికే రూ.24,000 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు. ఇది కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా అమలు చేయాల్సిన ప్రాజెక్టు. కేంద్ర కేబినెట్ నుంచి ఆమోదం లభించిన వెంటనే పనులు వేగంగా మొదలయ్యే అవకాశం ఉంది.