- Home
- Telangana
- Hyderabad: పై నుంచి చూస్తే ఇడ్లీ, దోశ ప్యాకెట్లు.. లోపల అసలు వ్యవహారం. హైదరాబాద్లో డెలివరీ బాయ్స్ సరికొత్త దందా
Hyderabad: పై నుంచి చూస్తే ఇడ్లీ, దోశ ప్యాకెట్లు.. లోపల అసలు వ్యవహారం. హైదరాబాద్లో డెలివరీ బాయ్స్ సరికొత్త దందా
Hyderabad: కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. ఇందుకోసం ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే, ఎలాంటి అడ్డదారులు తొక్కినా సరే. ఇటీవల కొంత మంది యువతలో కనిపిస్తోన్న తీరు ఇది. తాజాగా హైదరాబాద్లో ఇలాంటి ఓ వ్యవహారమే వెలుగులోకి వచ్చింది.

డబ్బు కోసం అడ్డదారి
హైదరాబాద్లోని అల్వాల్కి చెందిన ఓ యువకుడు బైక్ మెకానిక్గా జీవనం సాగిస్తున్నాడు. అయితే వివాహం తర్వాత ఖర్చులు పెరిగాయి. దీంతో అదనపు ఆదాయం కోసం బైక్ట్యాక్సీ నడపడం ప్రారంభించాడు. కానీ ఆదాయం సరిపోక, మిత్రుడి సలహాపై మత్తు వ్యాపారంలో అడుగుపెట్టాడు. నాగపూర్ వెళ్లి గంజాయి ప్యాకెట్లు తెచ్చి నగరంలో విక్రయించడం మొదలుపెట్టాడు. ఐదు నెలల్లోనే నలుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పెద్ద దందాగా మార్చుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి వద్ద లభించిన ప్యాకెట్ల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఈ మెకానిక్ గ్యాంగ్ను బట్టబయలు చేశారు.
ఆహార ప్యాకేజీలో మత్తు మందు
పోలీసుల కంట పడకుండా ఉండేందుకు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవల పోలీసులు ఆహార సరఫరా చేసే ఓ డెలివరీ బాయ్ బ్యాగ్ తనిఖీ చేయగా షాక్ అయ్యారు. ఇడ్లీ, దోశ, చట్నీ పొట్లాల మధ్య గంజాయి ప్యాకెట్లు దాచినట్లు గుర్తించారు. ఇదే తరహాలో మరో 20 మంది కూడా ఇదే రీతిలో సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
సరికొత్త మార్గంలో
హైదరాబాద్లో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా, మత్తుముఠాలు మాత్రం పద్దతులు మారుస్తూ గంజాయి సరఫరా కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే సుమారు 90 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి మొబైల్స్లో 1000 మందికి పైగా కొనుగోలుదారుల వివరాలు బయటపడ్డాయి. ఆన్లైన్ డెలివరీ సర్వీసుల బాయ్లకు ఎక్కువ కమీషన్ ఆశ చూపి వారిని డ్రగ్ క్యారియర్లుగా ఉపయోగిస్తున్నారు. బ్యాగ్ల పైభాగంలో ఆహార పొట్లాలు ఉంచి, అడుగున 60 నుంచి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్లను దాచిపెడుతున్నారు.
మత్తు అలవాటు నుంచి దందాకు
డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది మొదట మత్తు పదార్థాలకు బానిసలుగా మారినవారే. ఆ తర్వాత కమీషన్ ఆశతో సరఫరాదారులుగా మారుతున్నారు. గోవా, నాగపూర్, బీదర్, విశాఖపట్నం వంటి ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి తెచ్చి హైదరాబాద్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
పోలీసులకు సవాల్గా మారిన అంశం
హైదరాబాద్లో ప్రతి మూలలో డెలివరీ వాహనాలు, కొరియర్ బైక్లు తిరుగుతుండటంతో గంజాయి తరలింపును గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. రోజుకు వేలాది వాహనాలను తనిఖీ చేస్తున్నా, కొత్త పద్ధతుల్లో మత్తుముఠాలు తప్పించుకుంటున్నాయి.