మగ మహా రాజులకు విజ్ఞప్తి.. అందం చూసి టెంప్ట్ అయ్యారో, జీవితం రోడ్డున పడడం ఖాయం
Honey Trap: కళ్లతో చూసేదంతా నిజం కాదని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే ఆర్భాటాలను నమ్మితే జీవితం రోడ్డున పడడం ఖాయమని తాజాగా జరిగిన ఓ సంఘటన చెబుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..

కరీంనగర్లో కలకలం రేపిన హనీట్రాప్ కేసు
కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హనీట్రాప్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకున్న ఓ దంపతులు, యువకులను, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వల పన్నిన తీరు షాకింగ్గా మారింది. ఈ కేసులో పోలీసులు భార్యభర్తలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
వ్యాపార నష్టాల నుంచి నేరబాటకు
మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు కొన్నేళ్లుగా కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. గతంలో మార్బుల్ వ్యాపారం చేసి నష్టాలు చవిచూశారు. బ్యాంకు లోన్లు, ఈఎంఐలు భారంగా మారడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనకు వచ్చారు. అక్కడినుంచి నేర మార్గం మొదలైంది.
సోషల్ మీడియాలో వల పన్నిన తీరు
మొదట ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఆకర్షణీయమైన ఫోటోలు పోస్టు చేస్తూ పరిచయాలు మొదలు పెట్టేవారు. ముఖ్యంగా యువకులు, వ్యాపారులే లక్ష్యంగా చాటింగ్ ద్వారా నమ్మకం సంపాదించేవారు. తర్వాత వారిని ఇంటికి రావాలని ఆహ్వానించేవారు.
రహస్య వీడియోలు.. బ్లాక్మెయిల్ దందా
ఇంటికి వచ్చిన వారితో సన్నిహితంగా మెలుగుతూ రహస్యంగా వీడియోలు తీసేవారు. ఆ తర్వాత ఆ వీడియోలు చూపించి డబ్బులు ఇవ్వాలని బెదిరించేవారు. ఇవ్వకపోతే కుటుంబానికి పంపిస్తామని, సోషల్ మీడియాలో పెడతామని భయపెట్టేవారు. ఇలా దాదాపు వంద మందిని మోసం చేసినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఒక బాధితుడి ధైర్యంతో బయటపడిన నేరం
ఈ వలలో పడిన ఓ వ్యాపారి మొదట ఇలాగే ఓ రూ. 12 లక్షలు అప్పజెప్పాడు. అంతటితో ఆగని ఆ కిలాడీ కపుల్స్ మరో రూ.5 లక్షలు కావాలని బెదిరించడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ ఆధారాలతో విచారణ చేసి దంపతులను పట్టుకున్నారు. వారి ఫోన్లలో పలువురు బాధితుల వీడియోలు లభ్యమయ్యాయి. ఈ డబ్బులతో ఖరీదైన ఫ్లాట్, లగ్జరీ కారు కొనుగోలు చేసినట్టు తేలింది.
ఇలాంటి హనీట్రాప్ల బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలి?
ఈ ఘటన అందరికీ ఒక పెద్ద గుణపాఠం. సోషల్ మీడియా వాడకం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు అవసరం.
* తెలియని అకౌంట్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఆకర్షణీయమైన ఫోటోలు, తీపి మాటలు చూసి వెంటనే నమ్మకూడదు.
* వ్యక్తిగత విషయాలు షేర్ చేయొద్దు. ఫోటోలు, వీడియోలు, ఫోన్ నంబర్, అడ్రస్ లాంటి సమాచారం ఎవరికీ ఇవ్వకూడదు.
* ఆన్లైన్ పరిచయాలతో వ్యక్తిగత భేటీలు వద్దు ఎంత నమ్మకం వచ్చినా ఒంటరిగా కలవడం ప్రమాదమనే విషయాన్ని గుర్తించాలి.
* బ్లాక్మెయిల్ చేస్తే భయపడొద్దు. డబ్బులు ఇస్తే సమస్య తీరదని గుర్తించాలి. ఎక్కడ పరువు పోతుందా అని అస్సలు భయపడొద్దు. ముందుగా ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు ధైర్యంగా చెప్పండి. ఆ తర్వాత నేరుగా పోలీసులను సంప్రదించండి.
* సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్ చెక్ చేయాలి. మీ అకౌంట్ను, మీ పోస్టింగ్లను ఎవరు చూడాలి, ఎవరు మెసేజ్ చేయాలి అన్నది మన చేతిలో ఉండేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి.
* మొత్తం మీద సోషల్ మీడియా స్నేహాలు క్షణాల్లో ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఒక్క తప్పు నిర్ణయం జీవితాన్నే తలకిందులు చేయగలదు. ఈ కరీంనగర్ హనీట్రాప్ కేసు అందరికీ ఒక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండడమే అసలైన రక్షణ.

