- Home
- Telangana
- Telangana: తల్లిదండ్రుల ఖాతాల్లోకి పిల్లల 15 శాతం జీతం... సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.
Telangana: తల్లిదండ్రుల ఖాతాల్లోకి పిల్లల 15 శాతం జీతం... సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.
తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్న రోజులివి. అయితే అలాంటి వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా ఓ చట్టాన్నే తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తమను ప్రేమతో పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేస్తున్న కొంతమంది ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుకొచ్చారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది.
ఉద్యోగుల జీతం నుంచి 10-15 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన ఆదేశించారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై సానుకూల స్పందన వస్తోంది.
కన్నతల్లిదండ్రులను విస్మరించేవారికి హెచ్చరిక
తల్లిదండ్రులు జీవితాంతం తమ పిల్లల కోసం త్యాగాలు చేస్తారు. మంచి చదువు, సౌకర్యాలు కల్పించి వారిని స్థిరపడేలా చూస్తారు. అయితే తమకు జీవితాన్ని అందించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పక్కన పెట్టే దారుణ పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
మంచి జీతాలు వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు సైతం తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. ఈ దృష్ట్యా ప్రభుత్వం జీతాల్లో కోత విధించే యోచనతో ముందుకెళ్తోంది.
జీతాల కోత, నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో డిపాజిట్
సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి 10-15 శాతం కట్ చేసి, ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారులు సమగ్రంగా పరిశీలించి అమలు చేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇది ఉద్యోగుల కర్తవ్యాన్ని గుర్తుచేసే చర్యగా భావిస్తున్నారు.
సీనియర్ సిటిజన్లకు చట్టపరమైన రక్షణ
60 ఏళ్ల పైబడిన తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి పోషణ పొందాలనే హక్కును చట్టం కల్పిస్తోంది. "సీనియర్ సిటిజన్లు భరణా, సంక్షేమ చట్టం - 2007" ప్రకారం, తల్లిదండ్రులు తమ పిల్లలపై లేదా చట్టబద్ధ వారసులపై వ్యాజ్యం వేయవచ్చు. ప్రభుత్వం ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసి, ఈ దావాలను పరిష్కరించే వీలును కల్పిస్తుంది.
ఆస్తి బదిలీని రద్దు చేయొచ్చు
ఆస్తులు పంచుకున్న తర్వాత తల్లిదండ్రుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్న సంతానం కూడా మన సమాజంలో ఉంది. అయితే "సీనియర్ సిటిజన్లు భరణా, సంక్షేమ చట్టం - 2007ష లో కూడా ఇందుకు ఓ షరతు ఉంది. తల్లిదండ్రులు ఆస్తిని బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా భరణం అందకపోతే ఆ ఆస్తి బదిలీని రద్దు చేసుకునే అధికారం వారికి చట్టం కల్పిస్తుంది.
ఈ చర్యలు వృద్ధుల జీవితాల్లో గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా, సమాజంలో బాధ్యతతో కూడిన కుటుంబ వ్యవస్థను నిలబెడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పలువు అభిప్రాయపడుతున్నారు.