Weather Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో రాగల గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

రుతుపవనాల జోరు.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ అప్డేట్
నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే కొన్ని గంటలు చాలా కీలకమని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అటు ఆంధ్రప్రదేశ్లోనూ, ఇటు తెలంగాణలోనూ రాగల 24 గంటల నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వానతో పాటు పిడుగులు, ఈదురుగాలులు ఉంటాయనీ, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఏపీలోని ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
నర్సాపూరం, మచిలీపట్నం, ఏలూరు, గుడివాడ, దివిసీమ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించగా, ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, నెల్లూరుతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.
గంటకు 60 కి.మీ వేగంతో గాలులు.. విపత్తుల సంస్థ కీలక సూచనలు
వర్షాల సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కింద నిలబడవద్దని హెచ్చరించారు. కూలిపోయే స్థితిలో ఉన్న పాత ఇళ్లలో ఉండవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో కుండపోత.. స్తంభించిన జనజీవనం
హైదరాబాద్లో శనివారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 8 గంటల తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుత్బుల్లాపూర్, ఐడీపీఎల్, చింతల్, షాపూర్ నగర్, సూరారం, జీడిమెట్ల పరిసరాల్లో భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
తెలంగాణకు జూన్ 22 నుంచి భారీ వర్ష సూచన
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో జూన్ 22 నుంచి వర్షాల తీవ్రత మరింత పెరగనుంది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది. జూన్ 21న ఉత్తర, తూర్పు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ వంటి జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఉన్నప్పటికీ, జూన్ 22 నుండి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా కూల్ కానుంది.
జూన్ 24, 25 తేదీల్లో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

