కేసీఆర్ చిన్న మాటే వినోద్ కొంపముంచింది
చిన్న మాట తూలడం రాజకీయాల్లో కీలక మలుపులకు కారణంగా మారుతాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు చేసిన వ్యాఖ్యలు కరీంనగర్లో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కరీంనగర్ ఎంపీ స్థానంలో బీజేపీకి కలిసి వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని కరీంనగర్ ఎంపీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్పై అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలువు.... చూస్తా అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్ను కేసీఆర్ స్వీకరించారు. ఆ సమయంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు.
దీంతో 2006 లో కరీంనగర్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది.కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు మాట తూలనాడడం వల్ల టీఆర్ఎస్కు కలిసివచ్చింది.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్కు నష్టం కల్గించాయి. కరీంనగర్ ఎంపీ స్థానంలో ప్రచారం చేసే సమయంలో బీజేపీని విమర్శిస్తూ 'హిందుగాళ్లు... బొందుగాళ్లు' అంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు హిందు వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కరీంనగర్ నుండి వినోద్ కుమార్ ను గెలిపిస్తే కేంద్ర మంత్రిగా కూడ అవకాశం దక్కనుందని కేసీఆర్ ప్రచారం చేసినా కూడ ప్రజలు పట్టించుకోలేదు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించాయి.
ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ గెలుపుకు దోహదపడింది.కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ స్థానాల నుండి వినోద్, కవితలు ఓటమి పాలు కావడం వెలమ సామాజిక వర్గం ఆధిపత్యానికి గండిపడినట్టు అయింది.