కేసీఆర్కు షాక్: కేటీఆర్ నాయకత్వానికి ఎదురు దెబ్బ
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు ప్రజలు షాకిచ్చారు. టీఆర్ఎస్కు ఏకపక్ష విజయాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్, బీజేపీలకు కూడ తెలంగాణ ఓటర్లు పట్టం కట్టారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కనీసం 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. హైద్రాబాద్లో ఎంఐఎం విజయం సాధిస్తోందని ఆ పార్టీ అంచనా వేసింది. టీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ ఓటర్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను కూడ గెలిపించారు.
తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాలకు టీఆర్ఎస్ పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకొంది.
బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపింది. దీంతో ఆయా ఎంపీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు టీఆర్ఎస్కు చుక్కలు చూపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్లు టీఆర్ఎస్కు షాకిచ్చారు. ఈ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకొంది. నల్గొండ ఎంపీ స్థానంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు.
మల్కాజిగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన బోయినపల్లి వినోద్కుమార్ ఓటమి పాలయ్యాడు.
ఈ దఫా వినోద్ కుమార్ కరీంనగర్ నుండి విజయం సాధిస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కుతోందని కూడ కేసీఆర్ ప్రచారం చేశారు. కానీ, ఓటర్లు మాత్రం వినోద్కుమార్కు షాకిచ్చారు.ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ను గెలిపించారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ కుమార్, ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి బాపూరావు ఆధిక్యంలో ఉన్నారు.
గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది. కానీ ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు, ఒక్క టీడీపీ ఎమ్మెల్యేలు కూడ టీఆర్ఎస్లో చేరుతామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ శాసనసభపక్షం టీఆర్ఎస్లో విలీనం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్ధి పాతూరి సుధాకర్ రెడ్డి ఓడిపోయాడు.
నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని యూటీఎఫ్ అభ్యర్ధినర్సిరెడ్డి విజయం సాధించారు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుండి రఘోత్తం రెడ్డి గెలుపొందారు. కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గెలుపొందారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్కు ప్రజలు షాకిచ్చారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ 8 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 4, కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం ఒక్క స్థానంలో విజయం సాధించింది.