కారు రివర్స్: కేసీఆర్పై హరీష్ దెబ్బ
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటర్లు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు వ్యూహత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక అభ్యర్థుల ఓటమిలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తెలంగాణ ఓటర్లు షాకిచ్చారు.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెైస్ పార్టీకి చెందిన కీలకమైన 26 మంది నేతల ఓటమిలో టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచారం వరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హరీష్రావును దూరంగా పెట్టారనే ప్రచారం సాగింది. కేసీఆర్ కేబినెట్లో హరీష్ రావుకు మంత్రి పదవి దక్కలేదు. కేటీఆర్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక అభ్యర్థుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో హరీష్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమి కోసం ఏ రకమైన వ్యూహన్ని అమలు చేయాలో స్థానిక నాయకత్వానికి సూచనలు చేశారు. ఆ సూచనలు అమలయ్యేలా కూడ చేశారు. ఈ ఎన్నికల సమయంలో హరీష్ రావు కోసం ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ను కూడ కేటాయించారు.
పార్లమెంట్ ఎన్నికల సమయానికి పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. కార్యకర్తల సమావేశం నుండి ప్రచారం వరకు కేటీఆర్ పర్యవేక్షణలోనే సాగాయి.
హరీష్ రావు కేవలం మెదక్ జిల్లాకే పరిమితం కావాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో కూడ ఒకానొక దశలో హరీష్ రావు పేరు కూడ చోటు దక్కలేదు. ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎంపీ సంతోష్ పేరును తొలగించి ఆయన స్థానంలో హరీష్ రావును నియమించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు మెదక్ ఎంపీ స్థానం తప్ప ఎక్కడా కూడ ప్రచారం నిర్వహించలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాదిరిగా ఇతర జిల్లాల్లో హరీష్ ఈ ఎన్నికల సమయంలో ప్రచారం చేయలేదు.
మెదక్ ఎంపీ పార్లమెంట్ స్థానం కంటే కరీంనగర్ ఎంపీ స్థానం నుండి కనీసం రెండు ఓట్లు ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. అయితే కరీంనగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు.
మెదక్ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మూడు లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. కేటీఆర్ సవాల్ను నిలుపుకోలేకపోయారు. హరీష్ మాత్రం ఐదు లక్షల మెజారిటీలో మూడు లక్షల మెజారిటీతో మెదక్ ఎంపీ అభ్యర్ధి విజయం సాధించేలా కృషి చేశారు.
హరీష్ను దూరం పెట్టడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు కూడ అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఈ పరిణామాలన్నీ కూడ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఏక పక్ష విజయం దక్కకుండా చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.