IPL 2026: ఆ ఇద్దరిపై రూ. 28.40 కోట్లు హాంఫట్.! CSKను తిట్టిపోస్తున్న నెటిజన్లు..
IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ వైఫల్యం, అలాగే ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మల భారీ ధర, వారి పేలవ ప్రదర్శనతో పాటు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో తప్పిదాలపై ఇప్పుడు ఓ సారి చూసేద్దాం. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

రికార్డు ధర పలికిన అనామకులు
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ గత కొన్ని ఏళ్లుగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 2025 సీజన్లో 10వ స్థానానికి పడిపోయిన చెన్నై, 2026 మినీ వేలంలో భారీ మార్పులు చేసింది. ముఖ్యంగా అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వేలంలో ఎవరూ ఊహించని విధంగా ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మల కోసం చెన్నై రూ. 28.40 కోట్లు ఖర్చు చేసింది. దేశవాళీలో బాగా ఆడారన్న కారణంతో ఇంత భారీ మొత్తం వెచ్చించినా, ఐపీఎల్లో వారు తేలిపోయారు
కార్తీక్ శర్మ దారుణ వైఫల్యం
ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ అనే ఇద్దరు అన్-క్యాప్డ్ ప్లేయర్ల కోసం చెన్నై ఏకంగా రూ. 28.40 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కొక్కరికి రూ. 14.20 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నా, వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు.
కార్తీక్ శర్మ: వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఇతను రాజస్థాన్పై 18 పరుగులు చేయగా, పంజాబ్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు.
ఆల్ రౌండర్ కు బౌలింగ్ లేదు
రూ. 14.20 కోట్లు పెట్టి కొన్న బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన ప్రశాంత్ వీర్, పంజాబ్పై కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆశ్చర్యకరంగా ఇతనికి బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. ఇప్పుడిదే విమర్శలకు దారితీస్తోంది.
ఆయుష్ మాత్రే ఒంటరి పోరాటం!
పంజాబ్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్ లో ఆయుష్ మాత్రే 73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిగతా బ్యాటర్ల సహకారం లేకపోవడంతో చెన్నై భారీ మూల్యం చెల్లించుకుంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన పోరులో చెన్నై 209 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
చెన్నైకి గాయాల బెడద
ఒకవైపు ఆటగాళ్ల ఫామ్ లేమి, మరోవైపు ఎంఎస్ ధోనీ గాయం చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. కెప్టెన్ రుతురాజ్ కూడా వరుసగా విఫలమవ్వడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి కూడా చివరి స్థానంతో సరిపెట్టుకుంటుందో.. లేదా కంబ్యాక్ ఇస్తుందో వేచి చూడాలి.

