IND vs SA : ఎవడ్రా ఈ ముత్తుసామి? గువాహటిలో భారత్ ను కష్టాల్లోకి నెట్టాడు !
Who is Senuran Muthusamy: సేనురన్ ముత్తుసామి అద్భుత సెంచరీతో గువాహటి టెస్ట్ లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. అసలు ఎవరి ముత్తుసామి? భారతీయ మూలాలున్న సఫారీ స్టార్ ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ముత్తుసామి అద్భుత సెంచరీ
భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు గువాహటిలో జరుగుతోంది. సెనురన్ ముత్తుసామి బ్యాటింగ్ లో సత్తా చాటడంతో సఫారీ జట్టు గట్టి పట్టు సాధించింది. అద్భుత సెంచరీతో సౌతాఫ్రికాకు భారీ స్కోర్ అందించాడు. తొలి రోజు నాటికి 247/6తో నిలిచిన ఆతిథ్య జట్టు, రెండో రోజు 489 పరుగుల భారీ స్కోరుతో ఆలౌటైంది. ఈ భారీ స్కోరుకు ప్రధాన కారణం టెయిలెండర్లతో కలిసి సృష్టించిన గట్టి భాగస్వామ్యాలు, ముఖ్యంగా ముత్తుసామి ఆడిన సెంచరీ ఇన్నింగ్స్.
206 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 2 సిక్స్లతో 109 పరుగులు చేసిన ముత్తుసామి అసాధారణమైన ఓర్పు, క్రమశిక్షణ, క్లాస్ ఆటతీరును ప్రదర్శించాడు. చాలా సమయం క్రీజులో నిలిచి భారత బౌలర్ల ప్రణాళికలను పూర్తిగా చెదరగొట్టాడు. ఏడో వికెట్కు కైల్ వెరినెతో 88 పరుగులు జోడించాడు. ఆ తర్వాత మార్కో యాన్సెన్తో 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. వికెట్ కాపాడుకుంటేనే అతను కొనసాగించిన ధృఢమైన బ్యాటింగ్ టెక్నిక్ భారత పేసర్లు, స్పిన్నర్లకు పెద్ద తలనొప్పిని తెప్పించింది.
భారతీయ మూలాలున్న సఫారీ స్టార్: ముత్తుసామి ఎవరు?
దక్షిణాఫ్రికా జట్టులో ఇప్పుడిప్పుడే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న సెనురన్ ముత్తుసామి భారత సంతతికి చెందిన ప్లేయర్. 1994 ఫిబ్రవరి 22న డర్బన్లో జన్మించిన అతని కుటుంబం తమిళనాడులోని నాగపట్టణం ప్రాంతానికి చెందినది. ఇప్పటికీ ఆయనకు అక్కడ బంధువులు నివసిస్తున్నారు.
క్లిఫ్టన్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత క్వాజులు నాటల్ యూనివర్సిటీ నుంచి సోషియల్ సైన్స్లో డిగ్రీ పొంది మీడియా, మార్కెటింగ్లో ప్రత్యేకత సాధించాడు. విద్యతో పాటు చిన్నప్పటి నుంచే క్రికెట్పై ఆసక్తి పెంచుకున్న ముత్తుసామి, అండర్–11 నుండి అండర్–19 వరకు క్వాజులు నాటల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఆరంభంలో బ్యాట్స్మన్గా ప్రారంభించిన అతను, తరువాత బౌలింగ్లో మెరుగైన ప్రతిభను చూపుతూ ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. 2019లో భారత పర్యటనలో వైజాగ్ టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీని తన తొలి అంతర్జాతీయ వికెట్గా తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
రెండో రోజు ఆట: దక్షిణాఫ్రికా ఆధిపత్యం, భారత బౌలర్ల పోరాటం
రెండో రోజు సఫారీ జట్టు ఆట పూర్తిగా ఆధిపత్యంతో సాగింది. ఉదయం సెషన్లో వికెట్ కోల్పోకుండా పరుగులు జోడించిన జట్టు, తర్వాతి సెషన్లో ముత్తుసామి, యాన్సెన్ జంట భారత బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. యాన్సెన్ 91 బంతుల్లో 93 పరుగులతో దూకుడుగా ఆడుతూ దక్షిణాఫ్రికా స్కోరును వేగంగా పెంచాడు.
ట్రిస్టన్ స్టబ్స్ (49), టెంబా బావుమా (41), మార్క్రమ్ (38), రికెల్టన్ (35), వెరినె (45) ఇన్నింగ్స్కు పటిష్టమైన పునాది వేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లను, జడేజా, సిరాజ్, బుమ్రా చెరో 2 వికెట్లను సాధించారు. రెండో రోజు ముగిసే సమయానికి భారత్ 6 ఓవర్లు మాత్రమే ఆడి 9/0తో నిలిచింది. యశస్వి జైస్వాల్ (7*), కేఎల్ రాహుల్ (2*) క్రీజులో ఉన్నారు.

