- Home
- Sports
- Team India semi final chances : రన్ రేట్ పంచాయితే ఉండదు.. టీమిండియా సెమీస్ కు చేరే ఏకైక మార్గమిదే
Team India semi final chances : రన్ రేట్ పంచాయితే ఉండదు.. టీమిండియా సెమీస్ కు చేరే ఏకైక మార్గమిదే
Team India semi final chances : నెట్ రన్ రేట్ గందరగోళం లేకుండా టీమిండియా సెమీస్ కు చేరే రాచమార్గం ఉంది. ఇందుకోసం సూపర్-8 సమీకరణలకు ఎలా కుదరాలో తెలుసా?

టీమిండియా సెమీస్ అవకాశాలు...
T20 World Cup 2026 : స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు టీమిండియా దొడ్డిదారిలో కాదు రాచమార్గంలో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంటే ఇతరజట్లతో నెట్ రన్ రేట్ పంచాయితీ లేకుండా నేరుగా విన్నింగ్ పాయింట్స్ తోనే సెమీస్ లో అడుగుపెట్టాలన్నమాట. ఇలా జరగాలంటే భారత్ ముందు ఒకే ఒక్క ఉత్తమ మార్గం ఉంది... అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారత్ సెమీస్ కు చేరే బెస్ట్ మార్గం...
టీ20 వరల్డ్ కప్ 2026 లో టీమిండియా ఆరంభం అదిరింది... ఓటమన్నదే ఎరగకుండా సూపర్-8 కు చేరింది. కానీ కీలక సమయంలో సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇదే సమయంలో జింబాబ్వేను వెస్టిండిస్ ఏకంగా 100 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించడం టీమిండియా సెమీస్ ఛాన్సెస్ ను మరింత క్లిష్టంగా మార్చింది.
ప్రస్తుతం వెస్టిండిస్ +5.350, సౌతాఫ్రికా +3.800 నెట్ రన్ రేట్ కలిగివున్నాయి. టీమిండియా -3.800 నెట్ రన్ రేట్ తో కొనసాగుతోంది... కాబట్టి దీని ఆధారంగా సెమీస్ కు చేరడం కష్టమే. అయితే ఈ నెట్ రన్ రేట్ తో అవసరం లేకుండా టీమిండియా సెమీస్ కు చేరాలంటే సూపర్-8 ఇకపై ఆడాల్సిన రెండు మ్యాచుల్లో విజయం సాధించాలి.
ఇవాళ (గురువారం) జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో టీమిండియా, వెస్టిండిస్ తో జరిగే మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించాలి. తర్వాత మార్చి 1 (ఆదివారం) వెస్టిండిస్ తో మ్యాచ్ లో కూడా భారత్ గెలిచితీరాలి. అప్పుడు టీమిండియా ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి… వెస్టిండిస్ 2 పాయింట్ల వద్దే ఆగిపోతుంది. ఇలా నెట్ రన్ రేట్ తో పనిలేకుండానే టీమిండియా ఈజీగా సెమీస్ కు చేరుతుంది.
విన్నింగ్ పాయింట్స్ తోనే సెమీస్ కు చేరే మరో మార్గం..
టీమిండియా తర్వాతి రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే 4 పాయింట్లు పొందుతుంది. ఇదే సమయంలో సౌతాఫ్రికా టీం వెస్టిండిస్, జింబాబ్వే రెండు జట్లపై ఓడిపోవాలి. అప్పుడు సౌతాఫ్రికా, జింబాబ్వే రెండు పాయింట్లకే పరిమితం అవుతాయి... వెస్టిండిస్, టీమిండియా నాలుగు పాయింట్లతో సెమీస్ కు చేరుకుంటాయి. ఈ సందర్భంలో కూడా నెట్ రన్ రేట్ అవసరం ఉండదు.
టీమిండియా సెమీస్ కు చేరే సంక్లిష్ట మార్గం..
నెట్ రన్ రేట్ ఆధారంగానే టీమిండియా సెమీస్ కు చేరాలంటే జింబాబ్వే, వెస్టిండిస్ పై భారీ పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఇదే సమయంలో సౌతాఫ్రికాపై వెస్టిండిస్... జింబాబ్వేపై సౌతాఫ్రికా విజయం సాధిస్తే మూడు జట్లు 4 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్ రేట్ ఆధారంగా భారత్, వెస్టిండిస్, సౌతాఫ్రికా జట్లలో రెండు సెమీస్ కు క్వాలిఫై అవుతాయి. టీమిండియా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటే సెమీస్ కు చేరుతుంది... లేదంటే టీ20 వరల్డ్ కప్ జర్నీ ముగుస్తుంది.
విజయంపైనే టీమిండియా ఫోకస్..
టీమిండియా ఆటగాళ్లు నెట్ రన్ రేట్ గురించి ఆందోళన చెంది ఒత్తిడికి గురికావద్దని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించారు. కూల్ గా ఆడి తర్వాతి రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే చాలు... విజయంపై మాత్రమే దృష్టి సారించాలని సలహా ఇచ్చారు. రన్ రేట్ ఒత్తిడితో ఆటగాళ్లు భారీ షాట్లకు ప్రయత్నించి విఫలమయ్యే అవకాశాలుంటాయి... ఇది మరింత ప్రమాదకరం... అందుకే కేవలం గెలుపుపై ఫోకస్ చేయాలని అశ్విన్ సూచించారు.

