- Home
- Sports
- T20 World Cup : టీమిండియా ఆడిందే ఒక్క మ్యాచ్.. ఇందులోనే ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసా?
T20 World Cup : టీమిండియా ఆడిందే ఒక్క మ్యాచ్.. ఇందులోనే ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసా?
ICC T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఆరంభమే అదిరింది. ఆడిన ఒక్క మ్యాచ్ లోనే ఎన్నో రికార్డులు సృష్టించింది… ఇందులో 5 అరుదైన రికార్డుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ లో సూర్యసేన రికార్డులు
టీ20 ప్రపంచకప్ 2026 లో టీమిండియాకు అద్భుత ఆరంభం లభించింది. అమెరికన్ టీంపై భారత్ విజయం అనేక మైలురాళ్లను సృష్టించింది. స్వదేశంలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్ లో అప్పుడే టీమిండియా ఆధిపత్యం మొదలయ్యింది... మొదటి మ్యాచ్ లోనే అనేక రికార్డులు నమోదయ్యాయి.
వాంఖడేలో అతి తక్కువ స్కోరు కాపాడుకున్న భారత్
ముంబై వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన టీ20ల్లో అత్యల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా భారత్ నిలిచింది (161/9). ఇక్కడ జరిగిన పది మ్యాచ్ల్లో ఇంతకంటే తక్కువ స్కోరును ఏ జట్టూ కాపాడుకోలేదు. గతంలో శ్రీలంకపై భారత్ 162/5 స్కోరును కాపాడుకుంది.
టీ20 వరల్డ్ కప్ లో వరుస విజయాలు
టీ20 ప్రపంచకప్లో భారత్కు ఇది వరుసగా తొమ్మిదో గెలుపు. గత వరల్డ్ కప్ 2024 ఎడిషన్లో వరుసగా ఎనిమిది విజయాలు సాధించింది. దీంతో అత్యధిక విజయాలతో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో సమానంగా నిలిచింది. తాజా విజయంతో ఈ దేశాలను అధిగమించింది… వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైన జట్టుగా టీమిండియా నిలిచింది.
కెప్టెన్ గా సూర్యకుమార్ రికార్డు
టీ20 ప్రపంచకప్లో తొలిసారి కెప్టెన్ గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు… కేవలం 49 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా మొదటిమ్యాచ్ లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా ఆడిన మొదటి మ్యాచ్ లో క్రిస్ గేల్ 88 పరుగులు చేశాడు. అతడి తర్వాతి స్థానం సూర్యకుమార్ దే.
టీ20 క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు
టీ20 క్రికెట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 17 అవార్డులతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు... 16 అవార్డులతో విరాట్ కోహ్లీని అధిగమించాడు. రోహిత్ శర్మ (14) తర్వాతి స్థానంలో ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు
టీ20 ప్రపంచకప్లలో నాలుగు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో సూర్యకుమార్ రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ ఎనిమిది అవార్డులతో అగ్రస్థానంలో ఉండగా, యువరాజ్, అశ్విన్, రోహిత్ శర్మ మూడేసి అవార్డులతో ఉన్నారు.

