IND vs ZIM : చెన్నైలో ఇండియా-జింబాబ్వే మ్యాచ్... వర్షం ముప్పు పొంచివుందా..?
Chennai Weather Forecast : ఇవాళ రాత్రి 7 గంటల నుండి తమిళనాడు రాజధాని చెన్నైలో ఇండియా-జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చే ఆ మ్యాచ్ టీమిండియా చాలా కీలకం. ఇలాంటి మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచివుందా..?

చెన్నైలో ఇవాళ వర్షం కురుస్తుందా..?
T20 World Cup 2026 : స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 లో టీమిండియా డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్దమయ్యింది. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే సూపర్-8 లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 26, గురువారం) జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో భారత్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచితీరాలి. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. అయితే కొద్దిరోజులుగా తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి... ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కు వర్షం ఏమైనా అంతరాయం కలిగిస్తుందా అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.
నేడు చెన్నై వాతావరణం ఎలా ఉంటుందంటే...
చెన్నైలో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి పొగమంచు కురిసింది... కానీ సమయం గడిచిన కొద్దీ మంచు తగ్గి మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ మేఘాలు వర్షాలను కురిపించే అవకాశాలు లేవని... కేవలం వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది. సాయంత్రం, రాత్రివేళల్లో కూడా చెన్నైలో మేఘాలతో కూడిన ఆహ్లాదకర వాతావరణమే ఉంటుందని తమిళనాడు వాతావరణ శాఖ తెలిపింది.
చెన్నై వాతావరణ కేంద్రం అంచనాలను బట్టి ఇండియా-జింబాబ్వే మ్యాచ్ లో వర్షం ముప్పు లేదని అర్థమవుతోంది. అయితే మేఘాల కారణంగా వెలుతురు సమస్య ఉండవచ్చు... అయితే రాత్రి ప్లడ్ లైట్ల వెలుగులోనే మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఆ సమస్య ఉండదు. మొత్తంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇండియా, జింబాబ్వే మ్యాచ్ జరుగుతుందని వాతావరణ శాఖ సూచనలను బట్టి తెలుసోంది.
చెన్నై పిచ్ అంచనాలు...
చెన్నైలోని చెపాక్ స్టేడియం సాధారణంగా స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది. అయితే రాత్రి సమయంలో పొగమంచు కురిస్తే మాత్రం స్పిన్నర్లకు బంతిపై పట్టు ఉండదు... దీంతో పరిస్థితులు మారే అవకాశాలుంటాయి. ముఖ్యంగా మంచు ఎఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే స్పిన్నర్లపై ఎక్కువగా ఉంటుంది... వారికి ఇబ్బంది తప్పదు.
చెన్నై స్టేడియం టీమిండియా టాప్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి హోం గ్రౌండ్. ఇక్కడ ఏ పరిస్థితుల్లో పిచ్ ఎలా మారుతుందో అతడికి బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి భారత స్పిన్నర్లకు అతడి సలహాలు సూచనలు ఎంతగానో పనిచేస్తాయి. వరుణ్ తో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జింబాబ్వేతో మ్యాచ్ లో బరిలోకి దిగనున్నారు.
ఇక పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్లో ఉండటం భారత జట్టుకు పెద్ద ఊరట. గత మ్యాచ్లో ఇతర బౌలర్లు విఫలమైనా బుమ్రా మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అర్షదీప్ సింగ్ కూడా మెరుగైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇలా బలమైన స్పిన్, ఫేస్ బౌలింగ్ అటాక్ తో జింబాబ్వేను చిత్తు చేయడానికి టీమిండియా సిద్దమయ్యింది.
టీమిండియా, జింబాబ్వేలకు డూ ఆర్ డై మ్యాచ్...
సూపర్-8 లో ఇప్పటికే మొదటి మ్యాచ్ ఓడిన టీమిండియా, జింబాబ్వేలకు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. అందుకే ఇరుజట్లు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతాయి. భారత్ తో పోలిస్తే జింబాబ్వే బలహీనమైన జట్టే... కానీ తనదైన రోజు అద్భుతాలు చేయగలదు. ఆస్ట్రేలియాను ఓడించిమరీ సూపర్ 8 కు చేరిన జింబాబ్వేను తక్కువ అంచనా వేయలేం. అందుకే టీమిండియా పూర్తి బలంతో, పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.

