బిగ్ షాక్.. టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్?
Suryakumar Yadav : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ చేరిన భారత్.. న్యూజిలాండ్ తో అమీతుమీకి సిద్ధమైంది. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ వార్తలతో మరో హాట్ టాపిక్ నడుస్తోంది. సూర్య నిజంగానే రిటైర్ తీసుకోబోతున్నారా?

ఫైనల్కు భారత్.. కెప్టెన్ సూర్య సారధ్యంలో అద్భుత ప్రయాణం
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్లో అడుగుపెట్టింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో జరగనున్న తుది పోరులో భారత్ తలపడనుంది. ఈ టోర్నీ చరిత్రలో మూడోసారి ఛాంపియన్గా నిలవడానికి టీమ్ ఇండియా కేవలం అడుగు దూరంలో ఉంది. సూర్య కెప్టెన్గా జట్టును సమర్థంగా నడిపిస్తున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పులలో అతను తన చాకచక్యాన్ని ప్రదర్శించి జట్టును ఫైనల్ చేర్చాడు.
బ్యాటింగ్లో వైఫల్యం.. ఆందోళనలో అభిమానులు
జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ, బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించలేక ఘోరంగా విఫలమవుతున్నారు. టోర్నీ ప్రారంభంలో అమెరికాపై 84* పరుగులతో మెరుపులు మెరిపించిన స్కై, ఆ తర్వాత ఆ స్థాయి ఆటను కొనసాగించలేకపోయారు. గత ఏడు మ్యాచుల్లో ఆయన కనీసం 40 పరుగుల మార్కును కూడా దాటలేకపోవడం గమనార్హం. ఎనిమిది మ్యాచుల్లో 34.37 సగటుతో 242 పరుగులు మాత్రమే చేసిన సూర్య, తన ట్రేడ్మార్క్ దూకుడును కోల్పోయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సెమీఫైనల్ వంటి కీలక మ్యాచుల్లోనూ తక్కువ స్కోరుకే పరిమితమవ్వడం విమర్శలకు తావిస్తోంది.
గత ఏడాది సూర్య ఫామ్.. 2026 లెక్కలు ఇవే
సూర్యకుమార్ యాదవ్ ఫామ్ గత కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతోంది. 2025లో ఆయన అత్యంత దారుణమైన ఫామ్ను ఎదుర్కొన్నారు. ఆ ఏడాది 21 మ్యాచుల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేసి, 13.62 సగటుతో నిరాశపరిచారు. అయితే, 2026 ప్రారంభంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో అద్భుతంగా పుంజుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 మ్యాచుల్లో 48.40 సగటుతో 484 పరుగులు సాధించారు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. కానీ, ఐసీసీ మెగా టోర్నీ టీ20 వరల్డ్ కప్లో నిలకడ లేకపోవడం గమనార్హం.
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ వార్తలు: నిజమెంత?
ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకుమార్ కేవలం టీ20 ఫార్మాట్కే పరిమితమయ్యారు. టెస్టు క్రికెట్కు దూరంగా ఉండటమే కాకుండా, వన్డే జట్టులోకి ఆయన తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం ఒకే ఫార్మాట్ ఆడుతూ, అందులోనూ ఫామ్ కోల్పోతే కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. శ్రేయాస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లు జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉండటం సూర్యపై ఒత్తిడి పెంచుతోంది. అందుకే కొన్ని రిపోర్టులు సూర్య రిటైర్మెంట్ ను విషయాలను ప్రస్తావిస్తున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
బీసీసీఐ వ్యూహం: కెప్టెన్సీ ఒక్కటే సరిపోదా?
2024 జూలై నుంచి టీ20 కెప్టెన్గా సూర్య రికార్డు అద్భుతంగా ఉంది. ఆయన నాయకత్వంలో భారత్ ఒక్క టీ20 సిరీస్ను కూడా కోల్పోలేదు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గతంలో తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే, కేవలం కెప్టెన్సీ ఆధారంగా ఎవరినీ జట్టులో కొనసాగనివ్వదు. ఆటగాడిగా రాణించడం తప్పనిసరి. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే సెలెక్టర్లు సూర్య ప్రదర్శనపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ వరల్డ్ కప్ గెలిస్తే, ఒక విజేతగా సూర్య తన వీడ్కోలును ప్రకటించే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు సూర్య మరికొన్నేండ్లు ఆడతారని చెబుతున్నారు. మరి ఈ వార్తల పై సూర్య ఏం చెబుతున్నారో చూడాలి.

