T20 World Cup 2026 Final : భారత్ vs కివీస్.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో ఎవరిది పైచేయి?
T20 World Cup 2026 Final : అహ్మదాబాద్లో జరిగే టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా టీమిండియా రికార్డులు, హెడ్ టు హెడ్ లెక్కల ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ : నయా హిస్టరికీ అడుగు దూరంలో భారత్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 8న జరగనున్న ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, బలమైన న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ అత్యంత నిలకడైన ప్రదర్శనతో ఫైనల్ చేరింది.
ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడింటిని గెలిచిన భారత్, ఇప్పుడు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గిన మొదటి జట్టుగా నిలవడానికి భారత్కు కేవలం ఒకే ఒక్క విజయం కావాలి.
ఫైనల్ వరకు టీమిండియా అద్భుత ప్రయాణం
ఈ టోర్నీలో భారత జట్టు ప్రస్థానం అద్భుతంగా సాగింది. ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో 29 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో 61 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్ను 17 పరుగుల తేడాతో ఓడించి జైత్రయాత్రను కొనసాగించింది.
ఈ టోర్నీలో ఏకైక ఓటమి.. మళ్లీ సూపర్ రీఎంట్రీ
ఈ టోర్నీలో భారత్కు ఎదురైన ఏకైక అడ్డంకి దక్షిణాఫ్రికా. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే, ఈ ఓటమి నుంచి భారత్ వెంటనే తేరుకుంది. ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేపై 72 పరుగులతో, మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను 7 పరుగుల స్వల్ప తేడాతో ఓడించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.
భారత్ vs న్యూజిలాండ్: గత రికార్డులు ఏం చెబుతున్నాయి?
టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు 30 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్ల్లో విజయం సాధించగా, న్యూజిలాండ్ 11 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. గణాంక పరంగా భారత్ పైచేయి సాధించినప్పటికీ, ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ ఎప్పుడూ కఠినమైన ప్రత్యర్థిగానే ఉంది. అహ్మదాబాద్ లో జరగనున్న ఈ మ్యాచ్లో ఇరు జట్లు తమ సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. ముఖ్యంగా భారత బ్యాటర్లు, కివీస్ బౌలర్ల మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది.
టీమిండియా బలబలాలు ఏమిటి?
భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత బలంగా కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు సమతూకంగా ఉంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి హిట్టర్లు టాప్ ఆర్డర్లో ఉండగా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి ఆల్ రౌండర్లు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నారు. బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత ఎనిమిది మ్యాచ్ల్లో భారత్ కనబరిచిన నిలకడ ఫైనల్లోనూ కొనసాగితే కివీస్కు కష్టాలు తప్పవు.
ఫైనల్ పోరుకు భారత జట్టు ఇదే
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

