Suryakumar Yadav : సారీ చెప్పిన సూర్యకుమార్ యాదవ్.. అసలేం జరిగిందంటే?
Suryakumar Yadav : 2026 టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ను పక్కన పెట్టడం తన తప్పేనని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం సూర్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అక్షర్ పటేల్ విషయంలో కెప్టెన్ సూర్య షాకింగ్ కామెంట్స్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా ఒక కీలక మ్యాచ్లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ను ప్లేయింగ్ ఎలెవన్ నుండి తొలగించడం తన తప్పేనని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బహిరంగంగా అంగీకరించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నెదర్లాండ్స్తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో అక్షర్ స్వల్ప గాయంతో ఆడలేదు. అయితే దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సమయానికి అతను కోలుకున్నప్పటికీ, వ్యూహాత్మక కారణాలతో అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల అక్షర్ పటేల్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని సూర్య వెల్లడించారు.
అక్షర్ చాలా కోపంగా ఉన్నారు..
ది ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్, ఆ నిర్ణయం తర్వాత అక్షర్ పటేల్తో మాట్లాడటం అంత సులభం కాలేదని చెప్పారు. "అతను చాలా కోపంగా ఉన్నాడు, అది సహజం కూడా. అతను అనుభవజ్ఞుడైన ఆటగాడు, ఐపీఎల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. నేను స్వయంగా వెళ్లి అతనికి క్షమాపణలు చెప్పాను. అది నా తప్పని, అందుకు చింతిస్తున్నానని అన్నాను. ఆ నిర్ణయం జట్టు ప్రయోజనాల కోసమే తీసుకున్నప్పటికీ, అతనికి బాధ కలిగించింది. మరుసటి రోజు మళ్ళీ మాట్లాడుకున్నాక పరిస్థితి సద్దుమణిగింది" అని సూర్య వివరించారు. ఆ మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడం గమనార్హం.
తిరుగులేని ప్రదర్శనతో టీమ్ ఇండియా రికార్డు
దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత టీమ్ ఇండియా వెంటనే పుంజుకుంది. జింబాబ్వేతో జరిగిన తర్వాతి మ్యాచ్లో అక్షర్ పటేల్ను మళ్ళీ జట్టులోకి తీసుకున్నారు. అక్షర్ ఈ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించారు. 8 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి, 8.20 ఎకానమీ రేటుతో మధ్య ఓవర్లలో కీలక బౌలర్గా నిలిచారు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్లు పట్టి మ్యాచ్ను మలుపు తిప్పారు. చివరికి ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి, టీ20 ప్రపంచకప్ చరిత్రలో టైటిల్ను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.
ఇషాన్ కిషన్ అద్భుతమైన రీఎంట్రీ.. సూర్య నమ్మకం అదే
టోర్నమెంట్ ప్రారంభానికి ముందు సూర్యకుమార్ యాదవ్ యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్తో మాట్లాడిన తీరు అతనికి ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. "నువ్వు నా కోసం వరల్డ్ కప్ గెలుస్తావా?" అని సూర్య అడిగిన ప్రశ్నకు, "నాపై కొంచెం నమ్మకం ఉంచండి, నేను చేసి చూపిస్తాను" అని ఇషాన్ బదులిచ్చారు. దేశవాళీ క్రికెట్లో కష్టపడి తిరిగి జట్టులోకి వచ్చిన ఇషాన్, ఈ ప్రపంచకప్లో 9 మ్యాచ్ల్లో 317 పరుగులు చేసి సత్తా చాటారు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, వ్యక్తిగత రికార్డుల కోసం తాము ఆడలేదని సూర్య స్పష్టం చేశారు. అలాగే అభిషేక్ శర్మ వరుసగా మూడు సార్లు డకౌట్ అయినా, జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచిందని తెలిపారు.
బుమ్రా.. అతనొక అద్బుతం
జట్టు విజయంలో బౌలర్ల పాత్రను సూర్య కొనియాడారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుతూ, "బుమ్రా మా పాలిట ఒక రోబోట్ వంటివాడు, అతను దేశానికి దక్కిన ఆస్తి. క్లిష్ట పరిస్థితుల్లో ఎప్పుడూ జట్టును ఆదుకుంటాడు" అని ప్రశంసించారు. ఫైనల్లో బుమ్రా 15 పరుగులకు 4 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచారు.
అలాగే సంజూ శాంసన్ ప్రశాంతతను కూడా సూర్య మెచ్చుకున్నారు. భారత్ లక్ష్యం ఇప్పుడు కేవలం ఇక్కడితో ఆగలేదని, 2028 ఒలింపిక్స్లో క్రికెట్ చేరనుండటంతో అక్కడ కూడా పతకం గెలవడమే తమ తదుపరి లక్ష్యమని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

