రాంచీలో రోహిత్, కోహ్లీ దూకుడు.. సచిన్-ద్రవిడ్ రికార్డ్ బ్రేక్కు కౌంట్డౌన్
IND vs SA : సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రాణిస్తే మరిన్ని రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటారు. లెజెండరీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ జోడీ రికార్డ్ను కూడా బద్దలు కొడతారు.

రాంచీలో ఇండియా సౌతాఫ్రికా తొలి వన్డే
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ను కోల్పోయిన టీమిండియా, ఇప్పుడు వన్డే పోరుకు సిద్ధమవుతోంది. నవంబర్ 30న రాంచీ జేఎస్ సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న తొలి వన్డేకు ముందు, అందరి చూపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పైనే ఉంది. ముఖ్యంగా ఈ ఇద్దరు స్టార్లు కేవలం క్రీజులో నిలిచి బ్యాటింగ్ ప్రారంభిస్తే చాలు భారత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్ ను సాధిస్తారు.
ప్రస్తుతం రోహిత్, కోహ్లీ జోడీ భారత తరఫున 391 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. ఇదే సంఖ్యలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ జోడీ ఆడింది. రాంచీలో రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఆడితే, అంతర్జాతీయ మ్యాచ్ల సంఖ్య 392కి చేరి కొత్త భారత రికార్డుగా నిలుస్తుంది.
రికార్డుల జాబితాలో రోహిత్ కోహ్లీ టాప్
టీమిండియా తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన జోడీల జాబితాలో సచిన్, ద్రవిడ్ జంట ఎప్పటినుంచో అగ్రస్థానంలో నిలుస్తోంది. అయితే, ఆధునిక క్రికెట్ శకంలో రోహిత్, కోహ్లీ జంట అదే స్థాయికి చేరుకుంది.
అత్యధిక మ్యాచ్లు ఆడిన భారత జోడీలు
- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ: 391*
- సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్: 391
- రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ: 369
- సచిన్ తెందూల్కర్, అనిల్ కుంబ్లే: 367
- విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా: 309
ఈ జాబితా చూస్తే కూడా రోహిత్, కోహ్లీ జోడీ భారత క్రికెట్లో ఎంత ప్రభావం చూపిందో స్పష్టమవుతుంది. ముఖ్యంగా గత దశాబ్దంలో టీమిండియా వన్డే క్రికెట్ను స్థిరపరచడంలో వీరిద్దరి పాత్ర కీలకంగా ఉంది.
టెస్ట్ వైట్వాష్ నిరాశ తర్వాత వన్డేల్లో టీమిండియా
సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ పూర్తిగా విఫలమైంది. కోల్కతాలో 30 పరుగుల తేడాతో, గువాహటిలో 408 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఇది రన్స్ పరంగా భారత జట్టు చరిత్రలోనే అత్యంత పెద్ద పరాజయం.
ఈ నేపథ్యంలో, వన్డే సిరీస్ భారత జట్టుకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్లో చూపిన అద్భుత ఫామ్, కోహ్లీ తిరిగి ట్రాక్ లోకి రావడం ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు మంచి సంకేతాలు ఇస్తున్నాయి.
రాంచీలో క్రికెట్ ఫీవర్
ధోని స్వస్థలమైన రాంచీలో మ్యాచ్ జరుగుతుందంటే ఆ జోష్ మాములుగా ఉండదు మరి. క్రికెట్ ఫీవర్ మొదలైంది. నవంబర్ 25 ఉదయం 9 గంటలకు టికెట్లు అమ్మకానికి పెట్టినప్పటికీ, అభిమానులు రాత్రి 12 గంటల నుంచే స్టేడియం వెలుపల క్యూ కట్టారు.
టికెట్ ధరలు ₹1200 నుంచి ₹12,000 వరకు ఉండగా, 6 టికెట్ కౌంటర్లు, అందులో ఒకటి మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రాంచీలో తొలి వన్డే క్రమంలో క్రికెట్ ఫెస్టివల్ వాతావరణం నెలకొంది.
జట్టులో కొత్త ముఖాలు.. కెప్టెన్ కేఎల్ రాహుల్
శుభ్మన్ గిల్ గాయంతో అవుట్ అయ్యాడు. వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ భారత కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.
భారత్ జట్టు: రోహిత్, యశస్వీ, కోహ్లీ, తిలక్, రాహుల్, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీష్ రెడ్డి, హర్షిత్, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.
వన్డే సిరీస్ షెడ్యూల్
- తొలి వన్డే – నవంబర్ 30, రాంచీ
- రెండో వన్డే – డిసెంబర్ 3, రాయ్పూర్
- మూడో వన్డే – డిసెంబర్ 6, విశాఖపట్నం

