కోహ్లి జెర్సీతో బరిలోకి రిషబ్ పంత్.. నెట్టింట రచ్చ మొదలు..
Rishabh Pant: గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. ఇండియా ఏ మ్యాచ్లో విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18 ధరించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

పంత్ ఈజ్ బ్యాక్..
ఇంగ్లాండ్ సిరీస్ లో గాయపడిన రిషబ్ పంత్ దాదాపు మూడు నెలల విరామం తర్వాత మళ్ళీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వద్ద జరిగిన ఇండియా ఏ, దక్షిణాఫ్రికా ఏ మధ్య నాలుగు రోజుల మ్యాచ్ తో పంత్ తన పునరాగమనాన్ని చేశాడు. అయితే, ఈ మ్యాచ్ లో పంత్ ఒక ప్రత్యేకమైన జెర్సీ ధరించడం సోషల్ మీడియాలో పెద్ద ఆసక్తికరంగా మారింది. పంత్ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి చెందిన నంబర్ 18 జెర్సీని ధరించాడు.
బీసీసీఐ ఏం చెబుతోంది..
ఈ జెర్సీ నంబర్ 18 విషయానికి వస్తే, గతం మే నెలలో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన రిటైర్మెంట్ తర్వాత అభిమానులు బీసీసీఐను కోహ్లీ జెర్సీ నంబర్ 18 ని శాశ్వతంగా రిటైర్ చేయాలని కోరారు. మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ ఎంఎస్ ధోని నంబర్ 7, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నంబర్ 10 జెర్సీలకు ఇచ్చిన గౌరవంలాగే, కోహ్లీ జెర్సీ నంబర్ ను కూడా ఎవరికీ ఇవ్వొద్దని అభిమానులు విజ్ఞప్తి చేశారు. కానీ బీసీసీఐ ఇప్పటివరకు దానిపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఆ జెర్సీ నంబర్ ఇంకా ఉపయోగంలోనే ఉంది.
18 నంబర్ జెర్సీ
గతం జూన్ లో కూడా ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ ఇండియా ఏ తరపున ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో 18 నంబర్ జెర్సీ ధరించినప్పుడు పెద్ద వివాదం చెలరేగింది. అప్పట్లో అభిమానులు ఆ నిర్ణయాన్ని కోహ్లీకి అవమానంగా అభివర్ణించారు. తాజాగా రిషబ్ పంత్ అదే నంబర్ జెర్సీని ధరించడంతో మరోసారి ఈ చర్చ మొదలైంది.
బీసీసీఐ సీనియర్ అధికారి స్పష్టత
ఈ వివాదంపై బీసీసీఐ సీనియర్ అధికారి స్పష్టత ఇచ్చారు. అధికారుల ప్రకారం, ఇండియా ఏ మ్యాచ్లలో ఆటగాళ్లు ఏ నంబర్ అయినా ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు ఉండవు కాబట్టి, నంబర్లు కూడా స్థిరంగా ఉండవు. ఇండియా ఏ జట్టులో ఆడేటప్పుడు ఆటగాళ్లు సాధారణంగా తమ అంతర్జాతీయ జెర్సీ నంబర్లను ధరించరు. కానీ అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లలో మాత్రం ప్రతి ఆటగాడి జెర్సీ నంబర్ శాశ్వతంగా ఉంటుందని, అది ఒకరి పేరుతో ముడిపడి ఉంటుందని తెలిపారు. అందువల్లే పంత్ ధరించిన 18 నంబర్ జెర్సీ కేవలం ఇండియా ఏ టీంకు మాత్రమే సంబంధించింది. అంతర్జాతీయ మ్యాచ్లలో పంత్ తన రెగ్యులర్గా ఉపయోగించే 17 నంబర్నే ధరిస్తాడని అన్నారు.
మళ్ళీ క్రికెట్ లోకి పంత్
ఈ జెర్సీ నంబర్ వివాదాన్ని పక్కన పెడితే, గాయం నుంచి పూర్తిగా కోలుకుని రిషబ్ పంత్ మళ్ళీ క్రికెట్ లోకి అడుగుపెట్టడం భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. సఫారీలతో జరిగే కీలక సిరీస్ లలో అతని ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పంత్ తిరిగి రావడం జట్టుకు బలం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.