- Home
- Sports
- ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
Josh Inglis: ఆసీస్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ ఐపీఎల్ 2026కు సంబంధించి పంజాబ్ కింగ్స్ను మోసం చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. తన వివాహం కారణంగా నాలుగు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పి, పంజాబ్ కింగ్స్ అతనిని వేలంలోకి వదిలేయడానికి కారణమయ్యాడు.

ఇంగ్లిస్ తీరు ఇప్పుడే హాట్ టాపిక్..
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ ఐపీఎల్ 2026 సీజన్లో తన లభ్యతకు సంబంధించి తీవ్ర వివాదానికి కారణమయ్యాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున అద్భుతంగా రాణించిన ఇంగ్లిస్, ఇప్పుడు అదే జట్టుకు నమ్మకద్రోహం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కేవలం రూ. 8.6 కోట్ల భారీ ధర కోసం పంజాబ్ యాజమాన్యాన్ని తప్పుదోవ పట్టించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం 45 నిమిషాల ముందు..
ఐపీఎల్ 2026 రిటెన్షన్ ప్రక్రియ ముగియడానికి కేవలం 45 నిమిషాల ముందు, జోష్ ఇంగ్లిస్ పంజాబ్ కింగ్స్కు ఒక మెయిల్ పంపాడు. ఏప్రిల్ 18న తన వివాహం ఉందని, ఈ కారణంగా రాబోయే సీజన్లో తాను కేవలం నాలుగు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటానని ఆ మెయిల్లో పేర్కొన్నాడు. పూర్తి సీజన్ ఆడే ప్లేయర్ను కోరుకున్న పంజాబ్ కింగ్స్, ఇంగ్లిస్ మాటలను నమ్మి అతడిని వేలంలోకి వదిలేయక తప్పలేదు.
నాలుగు మ్యాచ్లే అన్నాడు.. కట్ చేస్తే.!
అయితే, డిసెంబర్ 16న అబుదాబిలో జరిగిన వేలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం నాలుగు మ్యాచ్లే అందుబాటులో ఉంటాడని తెలిసి కూడా లక్నో సూపర్జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు జోష్ ఇంగ్లిస్ కోసం హోరాహోరీగా పోటీపడ్డాయి. చివరికి, లక్నో జట్టు రూ. 8.6 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. ఒక ప్లేయర్ కేవలం నాలుగు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటే, ఇతర జట్లు అంత భారీ ధర ఎందుకు చెల్లిస్తాయనేది పంజాబ్ కింగ్స్ యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది.
ఆ ఫ్రాంచైజీలకు ముందే తెలుసు..
లక్నో, సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలకు జోష్ ఇంగ్లిస్ లభ్యతపై ముందే పూర్తి స్పష్టత ఉన్నట్లు సమాచారం. ఆ రెండు జట్ల కోచ్లు జస్టిన్ లాంగర్, డానియల్ వెట్టోరి ఆస్ట్రేలియా క్రికెట్తో సన్నిహిత సంబంధాలు కలిగిన వారు కావడంతో, ఇంగ్లిస్ తన పెళ్లి తర్వాత హనీమూన్ను వాయిదా వేసుకుని మరీ ఐపీఎల్ ఆడతాడనే విషయం వారికి ముందే తెలిసిందని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది.
ఇంగ్లిస్పై పంజాబ్ ఆగ్రహం
ఈ సమాచారంతో వేలం ముగిసిన తర్వాత ఇంగ్లిస్ తన ప్రణాళికలు మార్చుకోవడం పంజాబ్ యజమాని నెస్ వాడియాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇంగ్లిస్ సీజన్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్లు ఆడి, పెళ్లి కోసం చిన్న విరామం తీసుకుని, మళ్లీ హనీమూన్ వెళ్లకుండా నేరుగా లక్నో జట్టులో చేరనున్నాడని సమాచారం. ఇదే నిజమైతే, ఒక నాణ్యమైన వికెట్ కీపర్, బ్యాటర్ను పంజాబ్ కింగ్స్ చేజేతులారా కోల్పోయినట్లవుతుంది. ఈ వివాదం రానున్న రోజుల్లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

