- Home
- Sports
- IPL vs PSL : ఐపిఎల్ దెబ్బ - పిఎస్ఎల్ అబ్బా..! పాక్ ను కూరలో కరివేపాకులా తీసిపడేసిన క్రికెటర్లు వీళ్లే..
IPL vs PSL : ఐపిఎల్ దెబ్బ - పిఎస్ఎల్ అబ్బా..! పాక్ ను కూరలో కరివేపాకులా తీసిపడేసిన క్రికెటర్లు వీళ్లే..
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఒకేసారి జరుగుతున్నాయి... దీంతో విదేశీ ఆటగాళ్లు పాక్ నుండి ఇండియాకు క్యూ కడుతున్నారు. ఇలా ఎవరెవరు పిఎస్ఎల్ ను కాదని ఐపిఎల్ ఆడేందుకు సిద్దమవుతున్నారో తెలుసా?

పిఎస్ఎల్ నుండి ఐపిఎల్ కు క్యూ కడుతున్న ఫారిన్ ప్లేయర్స్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)కు విదేశీ ఆటగాళ్లు పెద్ద షాక్ ఇస్తున్నారు. ఐపీఎల్లో ఆడేందుకు పీఎస్ఎల్ను మధ్యలోనే వదిలేసి వచ్చేస్తున్నారు. గత రెండు సీజన్లుగా ఐపీఎల్, పీఎస్ఎల్ దాదాపు ఒకే సమయంలో జరగడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్లో ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే, వారి స్థానంలో ఆడేందుకు అవకాశం రాగానే ఫారిన్ ప్లేయర్స్ పీఎస్ఎల్ కాంట్రాక్టులను పక్కనపెట్టి ఇండియాకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్ వల్ల పీఎస్ఎల్ షెడ్యూల్ ఆలస్యమైంది. దీంతో ఐపీఎల్తో నేరుగా పోటీ పడాల్సి వస్తోంది.
బాష్ తో ప్రారంభమైన వలసలు
పీఎస్ఎల్ను వదిలి ఐపీఎల్కు వచ్చిన మొదటి కీలక ఆటగాడు దక్షిణాఫ్రికాకు చెందిన కార్బిన్ బాష్. 2025 సీజన్ కోసం పెషావర్ జల్మీతో ఒప్పందం చేసుకున్న బాష్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్లో చేరేందుకు పీఎస్ఎల్ను వదిలేశాడు. దీనిపై పీసీబీ లీగల్ యాక్షన్ తీసుకుంది. బాష్పై ఏడాది పాటు నిషేధంతో పాటు జరిమానా కూడా విధించింది.
2026 సీజన్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడటానికి సైన్ చేశాడు బ్లెస్సింగ్ ముజరబానీ.. ఇతడితో రూ.1.10 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ముజరబానీకి ఐపిఎల్ లో ఆడే అవకాశం వచ్చింది... దీంతో కోల్కతా నైట్ రైడర్స్లో చేరేందుకు పిఎస్ఎల్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానంలో ఈ జింబాబ్వే ప్లేయర్ కోల్కతా టీమ్లోకి వచ్చాడు.
పాక్ ను వీడనున్న శ్రీలంక ఆల్ రౌండర్
తాజా రిపోర్టుల ప్రకారం శ్రీలంక ఆటగాడు దసున్ షనక రాజస్థాన్ రాయల్స్లో చేరడానికి రెడీ అవుతున్నాడు. సామ్ కరన్ స్థానంలో షనకను తీసుకుంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఐపిఎల్ వేలంలో ఇతడిని ఏ జట్టూ తీసుకోకపోవడంతో పిఎస్ఎల్ ఆడేందుకు సిద్దమయ్యాడు షనక... లాహోర్ ఖలందర్స్ తరఫున ఆడాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ స్థానంలో శ్రీలంక ఆల్ రౌండర్ షనకకు అవకాశం కల్పిస్తోంది రాజస్థాన్... దీంతో పిఎస్ఎల్ కి షాక్ ఇస్తున్నాడు.
ఈ ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ పిఎస్ఎల్ వీడనున్నారా..?
ఐపిఎల్ కోసం పిఎస్ఎల్ ను వీడుతున్న ఆటగాళ్ల లిస్ట్ ఇంకా పెరిగేలాగే కనిపిస్తోంది. వెస్టిండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ఇప్పటికే లాహోర్ ఖలందర్స్ నుంచి తప్పుకున్నాడు. అతను లక్నో సూపర్ జెయింట్స్లోకి వెళ్తాడని టాక్ నడుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా క్వెట్టా గ్లాడియేటర్స్తో తన ఒప్పందాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్లో నాథన్ ఎల్లిస్ స్థానంలో జాన్సన్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సిఎస్కే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
పీఎస్ఎల్ కంటే ఐపిఎల్ కే ఎందుకంత స్పెషల్..?
ఐపీఎల్లో ఉండే డబ్బు, గ్లామర్, స్టార్ డమ్ వంటివే విదేశీ ఆటగాళ్లను పీఎస్ఎల్ నుంచి దూరం చేస్తున్నాయి. ఈ పరిణామం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే టీమిండియా చేతిలో వరుస ఓటములతో అవమానపడుతున్న పిసిబికి ఈ పరిణామాలు మింగుడుపడటంలేదు... కానీ ఏం చేయలేని పరిస్థితి. ఫారిన్ ఆటగాళ్ళు పిఎస్ఎల్ ను వీడటం ఐపిఎల్ కు ఏ స్థాయిలో ఆదరణ ఉందో తెలియజేస్తోంది.

