ఐపీఎల్ మినీ వేలంలో 1355 మంది ప్లేయర్స్.. 45 మంది పోటుగాళ్ల పైనే ఫోకస్
IPL Mini Auction : ఐపీఎల్ మినీ వేలం కోసం ప్రపంచవ్యాప్తంగా 1355 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. ₹2 కోట్ల బేస్ ధరలో 45 మంది ప్లేయర్స్ ఉన్నారు. అత్యధికంగా ₹64.30 కోట్ల పర్సుతో కోల్కతా నైట్ రైడర్స్ వేలంలోకి దిగుతోంది.

డిసెంబర్ 16న అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు సంబంధించి మినీ వేలం తేదీ ఖరారైంది. ఈసారి మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఈ వేలం కోసం ప్రపంచం నలుమూలల నుండి రికార్డు స్థాయిలో 1355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.
ఈ లిస్ట్లో ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్, ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. స్మిత్ గత కొన్ని సీజన్లలో ఐపీఎల్ ఆడలేదు. అయితే, ఈ మధ్యకాలంలో వివిధ టీ20 లీగ్లలో అతను అద్భుతమైన బ్యాటింగ్ను ప్రదర్శించాడు. దీంతో ఫ్రాంఛైజీల అతని పై ఫోకస్ పెట్టాయి. మరోవైపు, కామెరూన్ గ్రీన్ తన అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాల కారణంగా వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడిగా మారే అవకాశం ఉంది.
వేలంలోకి భారతీయ ఆటగాళ్లు
ఐపీఎల్ మినీ వేలంలోకి వచ్చిన భారతీయ ఆటగాళ్ల వివరాలను 'క్రిక్బజ్' రిపోర్టు వెల్లడించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, రాహుల్ చాహర్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ మావి, నవదీప్ సైనీ, చేతన్ సకారియా, కుల్దీప్ సేన్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సందీప్ వారియర్, ఉమేష్ యాదవ్ వంటి ప్రముఖ క్రికెటర్లు ఉన్నారు.
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ పెళ్లి కారణంగా ఈ సీజన్ మొత్తం ఆడటం కష్టమే. అయినప్పటికీ అతను కూడా వేలంలోకి వచ్చాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్కు చెందిన జేమీ స్మిత్, జానీ బెయిర్స్టో, న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర, శ్రీలంక ఆటగాళ్లు వానిందు హసరంగా, మతీశ పతిరాణా వంటి అంతర్జాతీయ స్టార్లు కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఐపీఎల్ వేలం : ₹2 కోట్ల అత్యధిక బేస్ ప్రైస్ లిస్ట్ ఇదే
వేలంలో అత్యధిక బేస్ ధర అయిన ₹2 కోట్ల జాబితాలో మొత్తం 45 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ 45 మందిలో కేవలం ఇద్దరు భారతీయ ఆటగాళ్లు మాత్రమే ఉండటం గమనార్హం. వారే రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్. మిగిలిన 43 మంది విదేశీ ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.
₹2 కోట్ల బేస్ ధరతో ఉన్న ప్రముఖ విదేశీ ఆటగాళ్లలో కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జేమీ స్మిత్, ముజీబ్ ఉర్ రెహమాన్, నవీన్ ఉల్ హక్ (ఆఫ్ఘనిస్తాన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కూపర్ కోనోలీ, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, జోష్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా), ముస్తాఫిజుర్ రెహమాన్ (బంగ్లాదేశ్), గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, డేనియల్ లారెన్స్, లియామ్ లివింగ్స్టోన్ (ఇంగ్లాండ్), డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్వెల్ (న్యూజిలాండ్), గెరాల్డ్ కోయెట్జీ, లుంగీ ఎన్గిడి, ఎన్రిక్ నోర్ట్జే (దక్షిణాఫ్రికా), పతిరాణా, మహేశ్ తీక్షణ, హసరంగా (శ్రీలంక) వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్లకు వేలంలో భారీ ధర లభించే అవకాశం ఉంది.
ఐపీఎల్ మినీ వేలంలో మరికొంత మంది కీలక విదేశీ ఆటగాళ్లు
ఐపీఎల్లో తొమ్మిది సీజన్లలో 71 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షాకిబ్ అల్ హసన్ తన బేస్ ప్రైస్ను ₹1 కోటిగా నిర్ణయించుకున్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్కు చెందిన ఆఫ్-స్పిన్నర్ ఆదిత్య అశోక్ కూడా ఉన్నాడు. ఇతని బేస్ ధర ₹75 లక్షలు. షాయ్ హోప్, అఖిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్ వంటి వెస్టిండీస్ ఆటగాళ్లు అత్యధికంగా ₹2 కోట్ల బేస్ ధరలో ఉన్నారు.
ఈ వేలంలో పాల్గొనేందుకు 14 దేశాల విదేశీ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ దేశాలలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, అమెరికా ఉన్నాయి. మలేషియా నుండి కూడా ఒక ఆటగాడు నమోదు చేసుకున్నాడు. భారత సంతతికి చెందిన రైట్-ఆర్మ్ ఆల్రౌండర్ వీరందీప్ సింగ్ ₹30 లక్షల బేస్ ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు.
ఫ్రాంఛైజీల పర్స్లో మిగిలిన మొత్తం ఎంత?
మినీ వేలం ప్రారంభం కాకముందే, రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి గడువు నవంబర్ 15గా ఉంది. ఈ గడువు నాటికి 10 ఫ్రాంఛైజీలు తమ రిటైన్ చేసుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. దీంతో, వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి అన్ని ఫ్రాంఛైజీల వద్ద ప్రస్తుతం మొత్తం ₹237.55 కోట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో అత్యధికంగా కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పర్సులో ₹64.30 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. వారి ఖాతాలో ₹43.40 కోట్లు ఉన్నాయి. ఈ మినీ వేలంలో మొత్తం 77 స్లాట్లు భర్తీ కానున్నాయి. ఇందులో 31 విదేశీ ఆటగాళ్ల స్లాట్లు ఉన్నాయి. ఈ వేలం ద్వారా ఫ్రాంఛైజీలు తమ జట్లను బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

