India vs Zimbabwe : తిలక్ అవుట్.. సంజూ ఇన్! సూపర్ 8లో భారత్ సెన్సేషనల్ ప్లాన్
India vs Zimbabwe : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8లో జింబాబ్వేతో జరిగే కీలక మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులు జరగనున్నాయి. తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్, సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ వచ్చే అవకాశం ఉంది. మరి అభిషేక్ శర్మ సంగతేంటి?

India vs Zimbabwe : టీమిండియాలో మార్పులు
టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర దశకు చేరుకుంది. సూపర్ 8లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఫిబ్రవరి 26, గురువారం జింబాబ్వేతో భారత్ తలపడనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్లో 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన టీమ్ ఇండియా, ఇప్పుడు ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాడు తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవాలని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సూచించారు.
సంజూ శాంసన్ రీఎంట్రీకి మార్గం సుగమం
ప్రస్తుత ప్రపంచకప్లో తిలక్ వర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అతను కేవలం ఒకే ఒక పరుగు చేసి అవుటయ్యాడు. అంతకుముందు మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్లో ఇబ్బంది పడుతుండటం టీమ్ ఇండియాకు ప్రధాన సమస్యగా మారింది.
ఈ నేపథ్యంలో రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకోవడం వల్ల బ్యాటింగ్ ఆర్డర్లో వైవిధ్యం వస్తుందని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డారు. నమీబియాపై సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఒకవేళ సంజూ జట్టులోకి వస్తే అతను మూడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. రింకూ సింగ్ తర్వాతి మ్యాచ్ కు దూరం అయ్యాడని సమాచారం. అభిషేక్ శర్మను ఆడిస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
అక్షర్ పటేల్ రాకతో బౌలింగ్ బలోపేతం
దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. బౌలింగ్లో రెండు ఓవర్లలో 17 పరుగులు ఇవ్వడమే కాకుండా, బ్యాటింగ్లోనూ 11 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో అక్షర్ పటేల్ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని డిమాండ్ వినిపిస్తోంది. అక్షర్ గతంలో భారత్ తరపున క్లిష్ట సమయాల్లో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో, అక్షర్ రాక జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓపెనింగ్ జోడీ.. మిడిల్ ఆర్డర్ ఇదే
జట్టులో మార్పులు జరిగినప్పటికీ, ఓపెనింగ్ స్థానంలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కొనసాగే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ గత మ్యాచ్లో 15 పరుగులు చేసినా, మేనేజ్మెంట్ అతని దూకుడును విశ్వసిస్తోంది. ఒకవేళ సంజూ శాంసన్ జట్టులోకి వస్తే, ఇషాన్ కిషన్ మూడవ స్థానంలో ఆడే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగవ స్థానంలో కొనసాగుతారు. సూర్య గత మ్యాచ్లో 18 పరుగులకే అవుటైనప్పటికీ, అతను ఏ క్షణమైనా ఫామ్లోకి వచ్చే ప్రమాదకర ఆటగాడు. మిడిల్ ఆర్డర్లో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యంగా శివమ్ దూబే ప్రస్తుత ఫామ్ భారత్కు పెద్ద ప్లస్ పాయింట్.
బౌలింగ్ విభాగంపై అంచనాలు
భారత బౌలింగ్ విభాగాన్ని బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. దక్షిణాఫ్రికాపై బుమ్రా 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి తన క్లాస్ చాటుకున్నాడు. అతనికి తోడుగా అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీసి రాణించాడు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్లో 47 పరుగులు ఇచ్చినప్పటికీ, చెన్నై పిచ్పై అతని రికార్డు బాగుండటంతో అతన్ని కొనసాగించే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ తోడైతే స్పిన్ విభాగం మరింత బలంగా మారుతుంది.
సెమీస్ రేసులో నిలవాలంటే గెలవాల్సిందే
దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత భారత్ నెట్ రన్ రేట్ బాగా పడిపోయింది. ప్రస్తుతం గ్రూప్ 1 పట్టికలో వెస్టిండీస్ అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా తర్వాతి స్థానంలో ఉంది. భారత్ సెమీఫైనల్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్తో జరిగే మ్యాచ్ మరింత కీలకం కానుంది. జింబాబ్వేతో మ్యాచ్లో భారత్ తన వ్యూహాలను మార్చుకుని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

